కన్సల్టెన్సీలకు ఇద్దాం.. కొత్త బ్యారేజీల నిర్మాణంపై జలవనరుల శాఖ ఆలోచన
ABN , First Publish Date - 2020-12-10T06:20:21+05:30 IST
కన్సల్టెన్సీలకు ఇద్దాం.. కొత్త బ్యారేజీల నిర్మాణంపై జలవనరుల శాఖ ఆలోచన

ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిన అధికారులు
ర్యాటిఫికేషన్ కోసం నిరీక్షణ
ఆ తర్వాతే టెండర్ల ఓపెన్
విజయవాడ, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : ప్రకాశం బ్యారేజీకి దిగువన రెండు కొత్త బ్యారేజీల నిర్మాణంలో నిబంధనలను సడలించాలని అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే ప్రభుత్వానికి పంపారు. ప్రకాశం బ్యారేజీకి 20 కిలోమీటర్ల దూరంలో పెనమలూరు మండలం చోడవరం వద్ద ఒక బ్యారేజీ, దీనికి 60 కిలోమీటర్ల దిగువన మరో బ్యారేజీ నిర్మించడానికి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ రెండింటికీ సమగ్ర ప్రాజెక్టు నివేదికను (డీపీఆర్)ను తయారు చేయడానికి జలవనరుల శాఖ అధికారులు కన్సల్టెన్సీలను ఆహ్వానించారు. కొద్దిరోజుల క్రితమే ఇందుకు సంబంధించిన టెండర్లను ఆన్లైన్లో దాఖలు చేసే ప్రక్రియ ముగిసింది. వాస్తవానికి ఈనెల ఏడో తేదీన టెండర్లను తెరచి, ఎల్-1, ఎల్-2, ఎల్-3 సంస్థలను ఎంపిక చేయాల్సి ఉంది. డీపీఆర్లు తయారు చేయడానికి కన్సల్టెన్సీలకు, ప్రాజెక్టులు, బ్యారేజీల నిర్మాణానికి క్లాస్-1 సంస్థలకు కాంట్రాక్ట్లు అప్పగిస్తారు. కొత్తగా నిర్మాణ బాధ్యతలను క్లాస్-1 కాంట్రాక్ట్ సంస్థలకు అప్పగించాని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిజైన్లను రూపొందించే కన్సల్టెన్సీలను దానికి మాత్రమే పరిమితం చేయకుండా నిర్మాణంలోనూ అవకాశం ఇస్తే బాగుంటుందని జలవనరుల శాఖ అధికారులు ఆలోచిస్తున్నారు.
ఆ వివరాలతో ఒక ఫైలును తయారు చేసి ర్యాటిఫికేషన్ కోసం ప్రభుత్వానికి పంపారు. ఈ ఫైలు అక్కడే పెండింగ్లో ఉంది. ఈ ర్యాటిఫికేషన్కు ప్రభుత్వం ఆమోదం వచ్చిన తర్వాత టెండర్లను తెరవాలని భావిస్తున్నారు. ఈ ఫైలు రెండు, మూడు రోజుల్లో జలవనరుల శాఖకు ఆమోదంతో వస్తుందని ఆ శాఖాధికారులు చెబుతున్నారు. ఈ టెండర్లలో తుది కన్సల్టెన్సీని ఎంపిక చేసిన తర్వాత నిర్మాణానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియను రెండు నెలల్లో పూర్తి చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆ తరువాత వచ్చేది వేసవి కాలమే కాబట్టి ఈలోపు పనులు మొదలు పెట్టించాలని ఆలోచిస్తున్నారు.