బందరు రైల్వేకు మహర్దశ

ABN , First Publish Date - 2020-10-14T16:03:41+05:30 IST

మచిలీపట్నం ప్రజల చిరకాల వాంఛ ఎట్టకేలకు నెరవేరింది. 150 ఏళ్ల చరిత్ర..

బందరు రైల్వేకు మహర్దశ

డబ్లింగ్‌ పనునులు పూర్తయినట్లు నేడు రైల్వే అధికారుల ధ్రువీకరణ

రూ. 100 కోట్లతో పూర్తి కావస్తున్న నూతన రైల్వేస్టేషన్‌ పనులు


మచిలీపట్నం: మచిలీపట్నం ప్రజల చిరకాల వాంఛ ఎట్టకేలకు నెరవేరింది. 150 ఏళ్ల చరిత్ర గల బందరు రైల్వేస్టేషన్‌ను రూ. 100 కోట్లతో చేస్తున్న అభివృద్ధి పనులు పూర్తి కావస్తున్నాయి. మచిలీపట్నం నుంచి గుడివాడకు రెండో రైల్వే ట్రాక్‌ లేకపోవడంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులకు గురవుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో గుడివాడ - మచిలీపట్నం మధ్య 35 కిమీ పొడవున రూ.350కోట్లతో చేపట్టిన డబ్లింగ్‌ పనులు పూర్తయ్యాయి. బుధవారం రైల్వే సేఫ్టీ కమిషనర్‌ రామ్‌క్రిపాల్‌ (న్యూ ఢిల్లీ) డబ్లింగ్‌ పనులను ధ్రువీకరించనున్నారు. బ్రిటీ్‌షవారి కాలంలో బందరు కోట వరకు రైల్వే ట్రాక్‌ ఉండేది. ఈ నూతన రైల్వే ట్రాక్‌ విస్తరణలో గిలకలదిండి వరకు రైల్వేలైన్‌ నిర్మించడం విశేషం. డబ్లింగ్‌ కోసం ఏడు బ్రిడ్జిలు, 114 కల్వర్టులను పునఃనిర్మించారు. రూ. 27 కోట్లతో భూ సేకరణ జరిగింది. దీంతో నిర్మాణం సులభంగా చేపట్టగలిగారు. కౌతవరం వద్ద ప్రత్యేక విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. పదేళ్ల పాటు ఎంపీగా ఉన్న కొనకళ్ల నారాయణరావు ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతితో మాట్లాడారు.


నా హయాంలోనే చాలా వరకు పనులు పూర్తి: మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు

నేను ఎంపీగా ఉండగానే రైల్వే డబ్లింగ్‌ పనులు చాలా వరకు పూర్తయ్యాయి. భీమవరం - నరసా పూర్‌, నిడదవోలు - మచిలీపట్నం మధ్య రైల్‌ వికాస్‌ నిగమ్‌ ఈ పనులు చేపట్టింది. మోటూరు - భీమవరం మధ్య ఈ డబ్లింగ్‌ పనులు చేపట్టేం దుకు ఎంతో కృషి చేశాం. అప్పట్లో కేంద్ర మంత్రి వద్దకు మూడుసార్లు వెళ్లి నిధులు తీసుకొచ్చాం. బందరు పోర్టు నిర్మిస్తే మచిలీపట్నం రైల్వేస్టేషన్‌ ప్రాంతమంతా ఒక పెద్ద జోన్‌గా ఏర్పడనుంది. ఎగుమతి, దిగుమతులు ఇక్కడ నుంచే వెళ్లే అవకాశాలున్నాయి. ఎందరికో జీవనోపాధి కలుగుతుంది. ఇప్పుడు మరిన్ని రైలు సర్వీసులు మచిలీపట్నానికి వచ్చేందుకు అవకాశం ఏర్పడింది. 


నెరవేరిన 91ఏళ్ల కల

గుడివాడ(రాజేంద్రనగర్‌) : 91 ఏళ్ల కల నెరవేరింది. గుడివాడ-మచిలీపట్నం రైల్వే లైన్లు డబ్లింగ్‌ చేయాలని 1929లోనే ప్రతిపాదన జరిగింది. అప్పటి నుంచి వాయిదా పడుతూ ఇప్పటికి పనులు పూర్తి చేసుకుని ప్రారంభోత్సవా నికి సిద్ధమైంది. పనులు పూర్తి కావటంతో రైల్వే సేఫ్టీ కమిషనర్‌ రామ్‌కృపాల్‌ మంగళవారం గుమ్మడికాయ కొట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్వీఎన్‌ఎల్‌ ప్యాకేజీ-4లో భాగంగా గుడివాడ-మచిలీపట్నం రైల్వే లైన్లు విద్యుద్దీకరణ, డబ్లింగ్‌ పనులు పూర్తయ్యాయని, రైల్వే ట్రాక్‌ పరీక్షించి, స్పీడ్‌ టెస్ట్‌ చేస్తామన్నారు.


గుడివాడ నుంచి 6 మోటార్‌ ట్రాలీల ద్వారా ట్రాక్‌ పరీక్షను ప్రారంభించామని, బుధవారం స్పీడ్‌ టెస్ట్‌ చేసి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఇస్తామన్నారు. అనంతరం ఈ లైన్లలో రైళ్ల రాకపోకలు కొనసాగుతాయన్నారు. ఈనెల 21న మోటూరు, ఉప్పులూరు మధ్య నిర్మించిన రైల్వే డబ్లింగ్‌ లైన్లను తనిఖీ చేస్తార న్నారు. ఈ తనిఖీల్లో విజయవాడ రైల్వే స్టేషన్‌ మేనేజర్‌ పి. శ్రీనివాస్‌, ఆర్వీఎన్‌ఎల్‌ సీపీఎమ్‌ మన్నా కుమార్‌, గుడివాడ రైల్వే స్టేషన్‌ మేనేజర్‌ పొట్లూరి మోహన గాంధీ, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ బి రవిబాబు, రహీమ్‌, పివి శేషగిరిరావు, మనోహర్‌, తదతరులు పాల్గొన్నారు. పనులు పూర్తి కావడం పట్ల బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామినేని వెంకటకృష్ణ హర్షం వ్యక్తం చేశారు.


Updated Date - 2020-10-14T16:03:41+05:30 IST