ఉదయం అదృశ్యం సాయంత్రం ప్రత్యక్షం
ABN , First Publish Date - 2020-11-19T06:26:49+05:30 IST
సెలూన్ షాపునకు వెళ్తున్నానని చెప్పిన అతడు అదృశ్యమయ్యాడు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆ బుడతడి ఆచూకీని పోలీసులు కనుగొనడంతో అదృశ్యం కథ సుఖాంతమైంది.
![ఉదయం అదృశ్యం సాయంత్రం ప్రత్యక్షం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
విజయవాడ, నవంబరు 18
చదరంగం నేర్చుకోవాలన్న ఓ బాలుడి ఆత్రుత అటు పోలీసులు, ఇటు తల్లిదండ్రుల్లో టెన్షన్ పుట్టించింది. సెలూన్ షాపునకు వెళ్తున్నానని చెప్పిన అతడు అదృశ్యమయ్యాడు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆ బుడతడి ఆచూకీని పోలీసులు కనుగొనడంతో అదృశ్యం కథ సుఖాంతమైంది. విజయవాడ మధురానగర్కు చెందిన 12 ఏళ్ల వెంకట కృష్ణ కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్నాడు. అతడి తండ్రి బ్యాంక్ ఉద్యోగి. చదరంగం నేర్చుకోవాలన్నది వెంకటకృష్ణ ఆలోచన. బుధవారం ఉదయం ఇంట్లో ఉన్న రూ.2వేలను తీసుకుని సెలూన్ షాపునకు వెళ్తున్నానని చెప్పి బయలుదేరాడు. ఉదయం ఏడు గంటలకు బయటకు వచ్చిన కుమారుడు ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ బాలమురళీకృష్ణ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వెంకటకృష్ణ హైదరాబాద్లో ఉన్నట్టు గుర్తించారు. అక్కడ చదరంగం క్రీడలో శిక్షణ ఇచ్చే అకాడమీలో చేరడానికి వెళ్లినట్టు గుర్తించారు. హైదరాబాద్లో వెంకటకృష్ణ బంధువులు ఉండడంతో వారికి సమాచారం ఇచ్చి బాలుడ్ని పట్టుకునేలా ఇక్కడి నుంచి ఏర్పాట్లు చేశారు. బాలుడి ఆచూకీ లభించడంతో అతడి తండ్రిని తీసుకుని ఒక పోలీసు బృందం హైదరాబాద్కు బయలుదేరి వెళ్లింది.