అమరావతికి పార్టీలను ఆపాదించొద్దు
ABN , First Publish Date - 2020-10-24T10:20:02+05:30 IST
అమరావతికి భూములు ఇచ్చి, రోడ్డున పడి, ఆందోళన చేస్తున్న వారికి పార్టీలను ఆపాదించడం అన్యాయమని రాజధాని గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే శ్రీదేవిపై రాజధాని
మహిళల మండిపాటు
311వ రోజుకు చేరుకున్న ఆందోళనలు
తుళ్లూరు/మంగళగిరి/తాడేపల్లి/తాడికొండ, అక్టోబరు 23 : అమరావతికి భూములు ఇచ్చి, రోడ్డున పడి, ఆందోళన చేస్తున్న వారికి పార్టీలను ఆపాదించడం అన్యాయమని రాజధాని గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని చేస్తున్న ఆందోళనలు శుక్రవారం 311వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమకు ఏ రాజకీయ పార్టీ మద్దతు తెలిపినా అక్కున చేర్చుకుంటామన్నారు. ఎమ్మెల్యే శ్రీదేవి అబద్ధాలు మాట్లాడారన్నారు. ప్రజా సమస్యలు పట్టని ఆమె వెంటనే రాజీనామా చేయాలని నినదించారు. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, యర్రబాలెం, నవులూరు, బేతపూడి, నిడమర్రు, నీరుకొండ, తాడేపల్లి మండలం పెనుమాక బొడ్డురాయి సెంటర్లో జరుగుతున్న రైతు రిలే దీక్షలు శుక్రవారంతో 311వ రోజుకు చేరాయి. తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక గ్రామాల రైతులు, మహిళలు శుక్రవారం కూడా నిరసనలు కొనసాగించారు.