వందో రోజుకు అమరావతి

ABN , First Publish Date - 2020-03-27T08:59:47+05:30 IST

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ గురువారం 100వ రోజు అమరావతి గ్రామాల రైతులు, రైతు కూలీలు, మహిళలు ఆందోళనలు కొనసాగించారు.

వందో రోజుకు అమరావతి

 రాజధాని రైతుల ఉద్యమం

కొనసాగిన నిరసన దీక్షలు 

ప్రతి ఇంటిపైనా జెండాలు,  

ముంగిట అమరావతి రంగవల్లులు


రాజధాని అమరావతి రైతుల ఉద్యమం వందో రోజుకు చేరుకుంది. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ గురువారం రైతులు, రైతు కూలీలు, మహిళలు ఆందోళనలు కొనసాగించారు. ఉద్యమం  వందరోజుల  సందర్భంగా ఇళ్ల ముందు 


జై.. అమరావతి ముగ్గులను తీర్చిదిద్దారు. ఇంటిపైన ఉద్యమ 

జెండాలను ఆవిష్కరించారు. విజయం సాధించేదాకా విరామం లేదని స్పష్టం చేశారు


గుంటూరు, తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి, మార్చి 26 : రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ గురువారం 100వ రోజు అమరావతి గ్రామాల రైతులు, రైతు కూలీలు, మహిళలు ఆందోళనలు కొనసాగించారు. సామాజిక బాధ్యతగా సామూహిక దూరాన్ని పాటిస్తూ నిరసలు చేపట్టారు. శిబిరాల్లో పది మంది చొప్పున కూర్చొని నినాదాలు చేశారు. దళిత జేఏసీ నేతలు ఇంటింటికీ తిరిగి కరోనా వైరస్‌పై అవగాహన కల్పిస్తూ మాస్క్‌ పంపిణీ చేశారు. మహిళలు ఇంటి ముంగిట సేవ్‌ అమరావతి అంటూ రంగవల్లులు తీర్చిదిద్దారు. ప్రతి ఇంటిపైనా నల్లజెండా, పచ్చ జెండాలు కట్టి నిరసనలు తెలిపారు.


గుంటూరు నగరంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముపాళ్ల నాగేశ్వరరావు, నాన్‌ పొలిటికల్‌ జాయింట్‌ యాక్షన్‌ నేతలు మల్లికార్జునరావు, డాక్టర్‌ నందగోపాల్‌ దంపతులు తమ ఇళ్లలోనే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నిరాహారదీక్ష కొనసాగించారు. వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా టీడీపీ  జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, మన్నవ సుబ్బారావు తదితరులు రైతులకు సంఘీభావం తెలిపారు. మనోవేదనతో మృతి చెందిన రైతులు, రైతు కూలీలకు తుళ్లూరు ధర్నా శిబిరంలో నివాళులర్పించారు.  రాత్రి 7.30 నుంచి 8గంటల వరకు విద్యుత్‌ ఆపి కొవ్వొత్తులు వెలిగించి అమరులకు అంజలి ఘటించారు. తాడేపల్లి మండలం పెనుమాకలో దీక్షలు కొనసాగాయి. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, యర్రబాలెం, నీరుకొండ, నవులూరు గ్రామాల్లో చేపట్టిన నిరసన దీక్షలు గురువారం 100వ రోజుకు చేరుకున్నాయి.  పలువురు రైతులు, మహిళలు ఇళ్ల వద్ద  జై అమరావతి అంటూ నినాదాలిస్తూ నిరసన దీక్షలో పాల్గొన్నారు. అమరావతి ఉద్యమం 100వ రోజుకు గుర్తుగా ఇళ్ల ముందు ప్రత్యేక ముగ్గులు వేసి తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు, పలువురు రైతులు, మహిళలు, రైతు కూలీలు పాల్గొన్నారు. యువజన జేఏసీ కన్వీనర్‌ రావిపాటి సాయి ఆధ్వర్యంలో గుంటూరు జేకేసీ నగర్‌లో పోరులో అమరులైన రైతులు, రైతు కూలీలకు ఘన నివాళలర్పించారు. 

Updated Date - 2020-03-27T08:59:47+05:30 IST