స్థానిక ఎన్నికలకు టీడీపీ సిద్ధం: అచ్చెన్న

ABN , First Publish Date - 2020-10-28T17:27:48+05:30 IST

ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తి గల సంస్థ అయినా మట్లాడే అవకాశం కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదని ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్న అన్నారు.

స్థానిక ఎన్నికలకు టీడీపీ సిద్ధం: అచ్చెన్న

అమరావతి: ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తి గల సంస్థ అయినా మట్లాడే అవకాశం కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదని ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్న అన్నారు. ఆనాడు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి,  దౌర్జన్యానికి దిగారన్నారు. ఆ సమయంలో అధికార పార్టీ చాలా స్థానాలను ఏకగ్రీవం చేసుకుందని ఆరోపించారు. ఎన్నికలను వాయిదా వేయడాన్ని రాష్ట్ర ప్రజలు స్వాగతించారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి విచిత్రమైన వ్యక్తి అని, సభ్యసమాజం సిగ్గుపడేలా ఎన్నికల కమిషనర్‌ను కులం పేరుతో దూషించారని విమర్శించారు. కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతుంటే ఇప్పుడు ఎన్నికలు వద్దంటున్నారన్నారు. ప్రాంతాలు, కులాల మధ్య తగాదాలు సృష్టించడం, సంక్షేమం లేకపోవడంతో, ఈ సమయంలో ఎన్నికలు పెడితే దెబ్బతింటామని వైసీపీ భావిస్తోందన్నారు.  


ఎన్నికలకు తాము సిద్ధమని, కేంద్ర బృందాలతో ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీని కోరామని అచ్చెన్న అన్నారు. నామినేషన్ ఆన్ లైన్‌లో ఫైల్ చేసే అవకాశం ఇవ్వాలన్నామన్నారు. ఎన్నికల సందర్భంగా అధికారులపై తీసుకున్న చర్యలు అమలు చేయాలని కోరామన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఇక్కడ నోటిఫికేషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటించి ఎన్నికలు నిర్వహించాలని తెలిపామన్నారు. 

Updated Date - 2020-10-28T17:27:48+05:30 IST