అమరావతి కోసం 88వ రోజూ కొనసాగిన ఆందోళనలు
ABN , First Publish Date - 2020-03-15T10:23:09+05:30 IST
అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని గ్రామాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి.
![అమరావతి కోసం 88వ రోజూ కొనసాగిన ఆందోళనలు](https://media.andhrajyothy.com/appimg/galleries/202003150445756/03152020045305n88.jpg)
గుంటూరు : అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని గ్రామాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మంగళగిరి మండలం ఎర్రబాలెం, నవులూరు, నిడమర్రు, కృష్ణాయపాలెం గ్రామాల్లో రైతులు, రైతు కూలీలు చేపట్టిన రిలే నిరసన దీక్షలు శనివారం 88వ రోజుకు చేరాయి. జేఏసీ నాయకులు ఎస్డీ షరీఫ్ సందర్శించి సంఘీభావం తెలిపారు. గుంటూరుకు చెందిన రమేష్ ఆస్పత్రి ఎండీ డాక్టర్ శైలజ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించి ఎర్రబాలెం రైతు దీక్షలకు సంఘీభావం తెలిపి రూ.20వేలను విరాళంగా అందజేశారు. తాడేపల్లి మండలం ఉండవల్లి, పెనుమాకలో నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. తాడికొండ అడ్డరోడ్డులో నిరసనలు శనివారం నాటికి 71వ రోజుకు చేరుకున్నాయి.
అమరావతి కోసం నేనుసైతం
అమరావతి పరిరక్షణ ఉద్యమంలో ఓ బాలుడు అందరినీ ఆకట్టుకుంటున్నాడు. రాయపూడి దీక్షా శిబిరానికి 88 రోజులుగా హాజరవుతున్నాడు అదే గ్రామానికి చెందిన దివ్యాంగుడు అంకరాజు. ఉదయం 9 గంటలకు అందరి కంటే ముందు హాజరై టెంట్లలో కుర్చీలు, మైకులను సిద్ధం చేస్తున్నాడు. ‘అమరావతిని కొనసాగేలా చూడమ్మా..’ అంటూ శిబిరం పక్కనే ఉన్న పోలేరమ్మకు 88 రోజులుగా తనే స్వయంగా అన్నప్రసాదం పెడుతున్నాడు. ఈ దివ్యాంగుడికి అధికారులు పింఛనును నిరాకరించారని గ్రామస్తులు చెబుతున్నారు. న్యాయ పోరాట నిమిత్తం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సాగిపాడు గ్రామస్తులు శనివారం రాజధాని రైతు జేఏసీ సభ్యులకు రూ.40వేలు అందజేశారు.