వైసీపీ మంత్రి సంతకం ఫోర్జరీ కేసు విచారణలో అపశ్రుతి

ABN , First Publish Date - 2020-02-16T09:46:05+05:30 IST

రాష్ట్ర శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత సంతకం పోర్జరీ కేసు చిన్నమండెం మండలంలో కలకలం

వైసీపీ మంత్రి సంతకం ఫోర్జరీ కేసు విచారణలో అపశ్రుతి

నిందితుడు రెడ్డెప్ప స్నేహితుడు కిరణ్‌ ఆత్మహత్యాయత్నం 

ప్రైవేటు ఆస్పత్రికి తరలింపు 

తనపై కేసు పెడతారేమోనన్న భయంతోనే చేశానంటున్న కిరణ్‌


చిన్నమండెం(కడప): రాష్ట్ర శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత సంతకం పోర్జరీ కేసు చిన్నమండెం మండలంలో కలకలం రేపుతోంది. కేశాపురం దేవలంపేటకు చెందిన వాల్మీకి సంఘం నాయకుడు మూగి రెడ్డెప్ప మంత్రి సంతకం పోర్జరీ చేసిన సిఫారస్సు లేఖను తమకు ఇచ్చారని పోలీసులకుచిన్నమండెం తహసీల్దార్‌ నాగేశ్వరరావు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే విచారణ ప్రారంభంలోనే అపశ్రుతి చోటు చేసుకుంది. రెడ్డెప్ప స్నేహితుడు కిరణ్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. అనంతరం వదిలేసిన కొద్దిసేపట్లోనే విషద్రావం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇంటి ముందే ఉన్న పోలీసులు వెంటనే రాయచోటిలోని ప్రవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..


కేశాపురం సర్వేనెంబరు 1648/3లోని 1.26 ఎకరాల ప్రభుత్వ భూమిని దేవలంపేటకు చెందిన ఎం. రెడ్డెప్పకు చిన్న పరిశ్ర ఏర్పాటు చేసుకోవడానికి కేటాయించాలని రాష్ట్ర శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత సిఫారస్సు లేఖను ఇచ్చారని... రెడ్డెప్ప స్థానిక తహసీల్దార్‌కు ఆ లేఖను జీరాక్స్‌ కాపీ ఇచ్చారు. సంతకంపై తహసీల్దారుకు అనుమానం రావడంతో రెడ్డెప్పపై స్థానిక స్టేషన్‌లో పిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా రెడ్డెప్ప కోసం చిన్నమండెం ఎస్‌ఐ హేమాద్రి ఆధ్వర్యంలో పోలీసులు జల్లెడపడుతున్నారు. ఈ క్రమంలోనే రెడ్డెప్ప స్నేహితుడు దేవలంపేటకు చెందిన కిరణ్‌ను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం రాత్రి స్టేషన్‌లోనే ఉంచుకున్నారు. తాను బయటకు వెళ్తే రెడ్డెప్ప తనకు ఫోన్‌ చేసే అవకాశం ఉంటుందని చెప్పడంతో శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో పోలీసులు  ఇతడిని ఇంటి వద్ద వదిలిపెట్టారు.


ఇంట్లోకి వెళ్లిన కిరణ్‌.. విషద్రావనం తాగాడు. గమనించిన పోలీసులు వెంటనే అతన్ని  పట్టణంలోని ఓ ప్రవేటు ఆస్పత్రికి  చికిత్సలు చేయిస్తున్నారు. ప్రాణాపాయం లేదని అంటున్నారు. కిరన్‌ మాట్లాడుతూ రెడ్డెప్ప, తాను స్నేహితులమని చెప్పాడు. రెడ్డెప్ప మంత్రి సంతకం ఫోర్జరీ చేశారని.. తన ఎక్కడ ఉన్నాడని పోలీసులు బెరించారని, ఆ క్రమంలో చేయి కూడా చేసుకున్నారని ఆరోపించాడు. కేసులో ఇరికిస్తారనే భయంతోనే ఆత్మహత్యాయత్నం చేసినట్లు చెప్పాడు. ఈ అంశంపై ఎస్‌ఐ హేమాద్రి మాట్లాడుతూ రెడ్డెప్ప ఆచూకీ కిరణ్‌కు తెలిసుంటుందని స్టేషన్‌కు తీసుకొచ్చామన్నారు. బయటకు వెళ్తే రెడ్డెప్ప ఫోన్‌ చేసే అవకాశం ఉందని చెప్పడంతో ఇంటి వద్దకు తీసుకెళ్లారని, భయంతోనే ఇలా చేశాడని పేర్కొన్నారు.

Updated Date - 2020-02-16T09:46:05+05:30 IST