క్షణికావేశం అనర్థదాయకం
ABN , First Publish Date - 2020-12-14T04:39:26+05:30 IST
చిన్నచిన్న విషయాలకు ఆందోళనకు గురవడం, ఫెయిల్ అయినంత మాత్రాన ఆత్మహత్యలకు పాల్పడడం మంచిది కాదని ఆర్జీయూకేటీ చాన్సలర్ ప్రొఫెసర్ కేసీరెడ్డి విద్యార్థులనుద్దేశించి ఉద్బోధించారు.

ట్రిపుల్ఐటీ విద్యార్థి సంతాప సభలో చాన్సలర్ కేసీరెడ్డి
వేంపల్లె, డిసెంబరు 13: చిన్నచిన్న విషయాలకు ఆందోళనకు గురవడం, ఫెయిల్ అయినంత మాత్రాన ఆత్మహత్యలకు పాల్పడడం మంచిది కాదని ఆర్జీయూకేటీ చాన్సలర్ ప్రొఫెసర్ కేసీరెడ్డి విద్యార్థులనుద్దేశించి ఉద్బోధించారు. ఫెయిల్ అయిన వారికి మరో అవకాశం ఉంటుందన్నారు. ఓటమిని విజయానికి సోపానంగా మలచుకుని విద్యార్థులు ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు. ట్రిపుల్ఐటీల్లో విద్యార్థుల సంక్షేమానికి కొత్త ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ట్రిపుల్ఐటీలో పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అనంతపురం జిల్లా పరిగి వాసి సాయిమనోజ్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడన్న కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై చాన్సలర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఇడుపులపాయ చేరుకున్న ఆయన సాయిమనోజ్ చిత్ర పటానికి నివాళులు అర్పించారు. అనంతరం అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతంకాకుండా జాగ్రత్త పడాలని ఆదేశించారు. ఏఓ మోహన్కృష్ణ, ఇడుపుల పాయ, ఒంగోలు అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు.