మైదుకూరు తహసీల్దారుకు షోకాజ్ నోటీసు
ABN , First Publish Date - 2020-12-28T05:45:18+05:30 IST
మైదుకూరులో శుక్రవారం జరిగిన ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో తగిన ఏర్పాట్లు చేయకపోవడంపై రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ జాయింట్ కలెక్టర్ గౌతమి తహసీల్దారు ప్రేమంతకుమార్కు షోకాజ్ నోటీసు ఇచ్చారు.
పట్టాల పంపిణీ ఏర్పాట్లలో గందరగోళం
ఆంధ్రజ్యోతికి స్పందన
మైదుకూరు, డిసెంబరు 27 : మైదుకూరులో శుక్రవారం జరిగిన ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో తగిన ఏర్పాట్లు చేయకపోవడంపై రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ జాయింట్ కలెక్టర్ గౌతమి తహసీల్దారు ప్రేమంతకుమార్కు షోకాజ్ నోటీసు ఇచ్చారు. ఇంటి పట్టాల పంపిణీలో లబ్ధిదారులు అవస్థలు పడటంతో పాటు వేదికపై తహసీల్దారుకు సీటు ఇవ్వకుండా వైసీపీ నాయకులు ఆసీనులు కావడంపై శనివారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. దీంతో ఏర్పాట్లలో విఫలం అయ్యారని, రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ తహసీల్దారు ప్రేమంతకుమార్కు ఆదివారం జాయింట్ కలెక్టర్ షోకాజు నోటీసు ఇచ్చారు. కాగా ఇంటి పట్టాల పంపిణీ కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు సభావేదిక, నిర్వహణ కార్యక్రమం రెవెన్యూ, మున్సిపాలిటీ, గృహ నిర్మాణ శాఖాధికారులు సంయుక్తంగా చేసినట్లు తెలిసింది.
అధికారుల వివరణ
జాయింట్ కలెక్టర్ షోకాజ్ నోటీసు ఇవ్వడంపై తహసీల్దారు ప్రేమంతకుమార్ను వివరణ కోరగా లబ్ధిదారులు ఎక్కువగా వస్తారని వారిని కంట్రోల్ చేయాలని డీఎస్పీకి ముందుగానే సమాచారం ఇచ్చామని తెలిపారు. దీనిపై మున్సిపాలిటీ కమిషనరు రామక్రిష్ణ వివరణ ఇస్తూ కార్యక్రమం నిర్వహణ రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ, మున్సిపాలిటీ కలిపి సంయుక్తంగానే చేపట్టామని తెలిపారు.