రైతన్నకు ఆర్థిక చేయూత
ABN , First Publish Date - 2020-04-15T09:56:07+05:30 IST
కరోనా కష్టకాలంలో చేతికొచ్చిన పంటను అమ్ముకోలేక దిగాలు చెందుతున్న రైతన్నకు కేంద్రం ఆర్థిక
![రైతన్నకు ఆర్థిక చేయూత](https://media.andhrajyothy.com/appimg/galleries/20200415040977/04152020042605n8.jpg)
ముందుగానే పీఎం కిసాన్ డబ్బు ఖాతాల్లోకి..
లాక్డౌన్ వేళ రైతుకు ఊరట
రూ.68.29 కోట్లు జమ
కడప, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): కరోనా కష్టకాలంలో చేతికొచ్చిన పంటను అమ్ముకోలేక దిగాలు చెందుతున్న రైతన్నకు కేంద్రం ఆర్థిక చేయూతనందిస్తోంది. ఖరీఫ్ ప్రారంభంలో ఇవ్వాల్సిన ప్రధానమంత్రి కిసాన్ పెట్టుబడి నిధిని ఈ నెలలోనే జమ చేస్తోంది. లాక్డౌన్ వేళ రైతులకు ఎంతో ఊరట కలగనుంది. 3,41,472 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకునేందుకు గాను ప్రధానమంత్రి కిసాన్ యోజన వైఎస్ఆర్ రైతు భరోసా పేరిట కేంద్రం రూ.6వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.7500 కలిపి మొత్తం రూ.13,500లను ఆర్థిక సాయంగా అందిస్తోంది. ఖరీఫ్, రబీ సీజన్లో పంటల సాగు పెట్టుబడి కోసం విడతల వారీగా అందిస్తోంది.
కేంద్రం రూ.2వేల చొప్పున మూడు విడతల్లో అందిస్తోంది. జిల్లాలో 3,41,472 మంది రైతులు కేంద్రం ఇచ్చే సాయానికి అర్హులు. వీరందరికీ రూ.2వేలు చొప్పున నగదు ఖాతాలో జమ అవుతుంది. మే మాసంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వైఎస్ఆర్భరోసా రూ.5500 జమ కానుంది. కౌలు రైతులకు కూడా మే నెలలోనే అందనుంది. పీఎం కిసాన్ నిధులు రూ.68.29 కోట్ల 44,000 రైతుల ఖాతాల్లో జమ కానుంది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.