-
-
Home » Andhra Pradesh » Kadapa » online money app closed
-
కొంప మునిగింది
ABN , First Publish Date - 2020-12-30T05:52:40+05:30 IST
రూ.5 వేలు కట్టండి.. రోజూ రూ.500 పొందండంటూ ప్రచారం చేసి దెబ్బకొట్టిన ఈ యాప్ సోమవారం నుంచి తన కార్యకలాపాలను నిలిపివేసింది.

విత్డ్రా ఆప్షన్ ఎత్తేసిన యాప్
వివరాల్లేక లబోదిబోమంటున్న చెల్లింపుదారులు
మోసపోయామంటూ బోరుమంటున్న వైనం
(కడప - ఆంధ్రజ్యోతి): అవును.. వాళ్లంతా కూర్చున్న చోటు నుంచి కదలకుండా సంపాదించాలనుకున్నారు.. చెమట చుక్క చిందించకుండానే రోజూ వేలాది రూపాయలు తీసుకోవాలని ఆశించారు.. వీళ్ల ఆశలకు తగ్గట్లు ఓ యాప్ కంపెనీ వల విసిరింది. అంతే..! నిద్రలే స్తూనే మొబైల్ పట్టుకునే అలవాటున్న వారిలో కొంతమంది ఆ యాప్ వలలో చిక్కుకున్నారు. అంతా బాగుంది.. లైఫ్ సెట్ అవుతుందనే మూమెంటులోనే యాప్ నిర్వాహకులు బిచాణా ఎత్తేశారు. దీంతో లబోదిబోమంటూ మొత్తుకుంటున్నారు. ఓ యాప్ మోసాలపై సోమవారం ఆంరఽధజ్యోతిలో వచ్చిన ‘కేటుగాళ్లు’ కథనం కడపలో కలకలం రేపింది. డబ్బు పోగొట్టుకున్న వారంతా ఇది తమ వార్తేనంటూ చర్చించుకుంటున్నారు.
యాప్ క్లోజ్
రూ.5 వేలు కట్టండి.. రోజూ రూ.500 పొందండంటూ ప్రచారం చేసి దెబ్బకొట్టిన ఈ యాప్ సోమవారం నుంచి తన కార్యకలాపాలను నిలిపివేసింది. గత పది రోజులుగా యాప్లో డిపాజిట్ చేసిన వారికి విత్డ్రా్స నిలిపివేసింది. శనివారం సాయంత్రం నుంచి సోమవారం వరకు విత్డ్రాలు అనుమతినిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో యాప్లో డిపాజిట్ చే సిన వారంతా సంతోషించారు. కట్టిన డబ్బులు వస్తుందని ఆశించారు. జ్యూస్ షాపులు నిర్వహిస్తూ కట్టిన వారు కూడా డబ్బు వస్తుందని సంతోషించారు. అయితే సోమవారం నుంచి ఒక్కసారిగా యాప్కు సంబంధించిన వివరాలు బ్లాక్ చేశారు. ఆదివారం వరకూ యాప్లో సభ్యత్వం తీసుకున్న వివరాలు, రావాల్సిన అమౌంటు మొత్తం వివరాలు కనిపించేవి. అయితే సోమవారం నుంచి అవేవీ కనిపించకపోవడంతో మునిగిపోయామంటూ లబ్ధిదారులు విలపిస్తున్నారు. ఏ పనీ చేయకపోయినా రూ.5 వేలు కడితే రోజుకు 400, రూ.50 వేలు కడితే 5 వేలలోపు వస్తుందన్న దురాశతో శక్తికి మించి అప్పులు చేసి ఆ యాప్లో జమ చేశారు. ఇప్పుడు ఉన్నట్లుండి యాప్ చేతులెత్తేయడంతో బాధితుల వేదన వర్ణణాతీతంగా మారింది. పోలీసులకు కంప్లయింట్ ఇస్తే ఆన్లైన్లో మోసాలు జరుగుతున్నాయి కదా ఎందుకు కట్టారంటూ పోలీసుల నుంచి ప్రశ్నలు వస్తాయని.. కుటుంబ సభ్యుల మధ్య ఎక్కడ పరువుపోతుందోనన్న భయంతో బయట పడడం లేదు. నష్టపోయిన బాధితులు ముందుకు రానంత వరకు మోసం చేసే వారి సంఖ్య రోజూ పెరుగుతూనే ఉంటుంది.