’ప్లీజ్.. సొంత డబ్బుల్తో కరోనా చికిత్స చేయించుకుంటా.. ప్రైవేటు ఆస్పత్రికి పంపండి’
ABN , First Publish Date - 2020-06-29T23:16:57+05:30 IST
మైదుకూరులో ఆదివారం మరో 6 కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 18కి చేరుకుంది. మైదుకూరులో జరిగిన నిశ్చితార్థం సంబంధం ఉన్న వారిలో చేపట్టిన పరీక్షల్లో కొంతమందికి
మైదుకూరులో మరో ఆరు....
మైదుకూరు(కడప) : మైదుకూరులో ఆదివారం మరో 6 కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 18కి చేరుకుంది. మైదుకూరులో జరిగిన నిశ్చితార్థం సంబంధం ఉన్న వారిలో చేపట్టిన పరీక్షల్లో కొంతమందికి ఫలితాలు రాగా వారిలో 5 మందికి పాజిటివ్ వచ్చింది. అలాగే ప్రొద్దుటూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా విధులు నిర్వహిస్తున్న మహిళకు పాజిటివ్ రావడంతో మొత్తం కేసుల సంఖ్య 18కి చేరుకుంది. పట్టణంలోని వనిపెంట రోడ్డులో ఇద్దరికి, కడప రోడ్డు, సరస్వతిపేట, లింగాలదిన్నె, సీతారామాపురంలలో ఒక్కొక్కరికి పాజిటివ్ నమోదు కావడంతో వారందరినీ కడప ఫాతిమాకు తరలించారు. కాగా ఇంకా ఫలితాలు రావాల్సిన వారు చాలా మంది ఉండటంతో ఇంకా కేసులు పెరిగే అవకాశముందని తెలుస్తోంది.
మమ్మల్ని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించండి
కడప ఫాతిమా కరోనా కేంద్రంలో పరిస్థితులు చూస్తే చాలా ఘోరంగా ఉన్నాయని తమను ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని పాజిటివ్ వచ్చిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి అధికారులను వేడుకున్నారు. రెండు రోజుల క్రితం పట్టణంలోని వనిపెంట రోడ్డులో ఒకే కుటుంబంలో ముగ్గురికి పాజిటివ్ రావడంతో స్థానికులను కొందరిని అధికారులు పరీక్షల నిమిత్తం ఫాతిమాకు పంపారు. వారిలో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి అక్కడి అధికారులతో గొడవపడటంతో అతడిని ఇంటికి పంపారు. పరీక్షల్లో అతడికి పాజిటివ్ రావడంతో అతడిని ఫాతిమాకు తరలించేందుకు వచ్చిన డీఎస్పీ విజయ్కుమార్, సీఐ మధుసూథనగౌడ్, మండల వైద్యాధికారి మల్లే్షలకు ఫాతిమాలో సౌకర్యాలు బాగా లేవని ఈ విషయాన్ని కలెక్టర్, అధికారులకు మెయిల్ పెట్టినట్లు తెలిపారు. తనను ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తే అక్కడ స్వంత డబ్బులు పెట్టుకుని చికిత్స చేయించుకుంటానని వారికి చెప్పారు. తాము ఉన్నతాధికారులను సంప్రదించి చెబుతామంటూ అధికారులు వెనుతిరిగారు. తిరిగి ఆదివారం రాత్రి 7.30 గంటలకు ఆ యువకుడిని ఆటోలో కడప ఫాతిమాకు అధికారులు తరలించారు.