వైభవోపేతం గుగ్గిళ ం జ్యోతుల పూజలు
ABN , First Publish Date - 2020-12-15T05:14:01+05:30 IST
కార్తీకమాసం అమావాస్య సందర్భంగా ఉదయం వీరభద్రస్వామికి, అఘోరలింగేశ్వరస్వామికి పంచామృత, రుద్రాభిషేకాలు నిర్వహించి ప్రత్యేకంగా సుగంధ పరిమళ భరిత పుష్పమాలలతో అలంకరించారు.
రాయచోటి టౌన్, డిసెంబరు 14: రాయచోటిలోని భద్రకాళీ సమేత వీర భద్రాలయంలో సోమవారం గుగ్గిళం జ్యోతుల పూజలు నిర్వహించారు. కార్తీకమాసం అమావాస్య సందర్భంగా ఉదయం వీరభద్రస్వామికి, అఘోరలింగేశ్వరస్వామికి పంచామృత, రుద్రాభిషేకాలు నిర్వహించి ప్రత్యేకంగా సుగంధ పరిమళ భరిత పుష్పమాలలతో అలంకరించారు. భస్మాలంకారములోని అఘోరలింగేశ్వరస్వామిని భక్తులు దర్శించుకున్నారు. భద్రకాళీ అమ్మవారిని వివిధ రంగుల గాజులతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. సాయంత్రం కర్ణాటక భక్తులచే గుగ్గిళం జ్యోతుల పూజ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకమైన పాత్రలల్లో పెద్దపెద్ద దీపం వత్తులను పెట్టి వెలిగించి వాటిని తలపైన పెట్టుకుని ఆలయం చుట్టూ ఊరేగారు. గుగ్గిళం పూజల్లో భాగంగా కర్ణాటక భక్తులు వీరశైవ నృత్యాలతో ఆకట్టుకున్నారు. స్థానిక భక్తులతో పాటు అధిక సంఖ్యలో కన్నడ భక్తులు ఈ పూజల్లో పాల్గొన్నారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం జరిగింది. ఈ కార్యక్రమాల్లో ఆలయ ఈవో మంజుల, ఇతర అధికారులు పాల్గొన్నారు.