విమానాశ్రయ విస్తరణకు భూసేకరణ
ABN , First Publish Date - 2020-10-29T09:20:27+05:30 IST
డప విమానాశ్రయ విస్తరణకు భూసేకరణ చేపట్టారు. విమానాశ్రయ విస్తరణకు అవసరమైన 47.53 ఎకరాలను రెవెన్యూ అధికారులు సేకరించారు.
పరిశీలించిన సబ్ కలెక్టర్
చెన్నూరు, అక్టోబరు 28 : కడప విమానాశ్రయ విస్తరణకు భూసేకరణ చేపట్టారు. విమానాశ్రయ విస్తరణకు అవసరమైన 47.53 ఎకరాలను రెవెన్యూ అధికారులు సేకరించారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఈ భూముల పరిశీలనకు వచ్చిన సబ్కలెక్టర్ పృథ్వీతేజ్కు రెవెన్యూ అధికారులు వివరించారు. కడప నగర పరిధిలో పాలెంపల్లె రెవెన్యూలో 26.5 ఎకరాలు, చెన్నూరు మండలం చిన్నమాచుపల్లె రెవెన్యూలో 20.78 ఎకరాలు సేకరించినట్లు కడప, చెన్నూరు తహసీల్దార్లు శివరామిరెడ్డి, బి.అనురాధ సబ్ కలెక్టరుకు వివరించారు. మొత్తం 47.53 ఎకరాలు 28 మంది రైతుల వద్దనుంచి తీసుకున్నామని తెలిపారు. రన్వే విస్తరణ కోసం ఈ భూమి సేకరించినట్లు సబ్ కలెక్టరుకు వివరించారు. విమానాశ్రయ విస్తరణ ఎక్కడి దాకా జరుగుతుంది, సేకరించిన భూమి ఎక్కడెక్కడుందనే విషయం సబ్కలెక్టరుకు మ్యాప్ ద్వారా రెవెన్యూ అధికారులు వివరించారు.
ప్రస్తుతం విమానాశ్రయ పరిధి తక్కువ కాబట్టి అవసరమైన వసతులు, రన్ వే పెరగాల్సి ఉందని, అందులో భాగంగానే ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భూసేకరణ చేపట్టినట్లు సబ్కలెక్టర్ తెలిపారు. అనంతరం సేకరించిన భూములను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దారు రాజేష్క్రిష్ణ, ఆర్ఐ వేణుగోపాల్, కడప సర్వేయరు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.