మీ నాన్నపేరుతో వచ్చావ్... ఆయన పేరును చెడగొడుతున్నావ్
ABN , First Publish Date - 2020-10-02T07:01:31+05:30 IST
మీ నాన్న పేరుతో అధికారంలోకి వచ్చావ్.. ఆయన పేరును చెడగొడుతున్నావని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సీఎం వైఎస్ జగన్పై మండిపడ్డారు.
నమ్మి ఓట్లు వేసిన వారిని సమాధి చేస్తావా
పరిహారం ఇచ్చిన తర్వాతే నిర్వాసితులను ఖాళీ చేయించాలి
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
కొండాపురం, అక్టోబరు 1: మీ నాన్న పేరుతో అధికారంలోకి వచ్చావ్.. ఆయన పేరును చెడగొడుతున్నావని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సీఎం వైఎస్ జగన్పై మండిపడ్డారు. గురువారం కడప జిల్లా కొండాపురం మండలంలోని గండికోట ముంపు గ్రామమైన తాళ్లప్రొద్దుటూరులో ఆందోళన చేస్తున్న నిర్వాసితులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ తనకు ఆత్మీయుడని ఆయన పేరును జగన్ చెడగొడుతున్నారని మండిపడ్డారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించడమంటే ఇప్పుడు ఊరిలో ఎలా బతుకుతున్నారో దాని కంటే పదిశాతం ఎక్కువగా సౌకర్యాలు కల్పించాలన్నారు.
అలా కాకుండా గండికోట నిర్వాసితులను పునరావాస కాలనీల్లో కనీసం ప్లాట్లు కూడా విడగొట్టకుండా, రాత్రికి రాత్రే ప్రాజెక్టులో నీళ్లను నింపి కనీస గడువు కూడా ఇవ్వకుండా ఎలా ఖాళీ చేయిస్తారని ప్రశ్నించారు. 29రోజులుగా నిర్వాసితులు ఆందోళన చేస్తున్నా ముఖ్యమంత్రి గాని, స్థానిక ఎమ్మెల్యే గాని పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. కొందరు నిర్వాసితుల పరిహారాన్ని కావాలనే ఆపేసి అధికారులు దళారులతో బేరమాడి ముంపువాసుల పరిహారాన్ని కూడా దోచుకుంటున్నారని ఆరోపించారు. శవాలపై పేలాలు ఏరుకొనే అధికారులను నియమించుకున్నారని ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు.
గండికోట నిర్వాసితుల్లో పేదలు, రైతులు, బడుగు, బలహీన వర్గాల వారు ఉన్నారని వారికి కనీస సౌకర్యాలు కల్పించకుండా నీళ్లు నింపడం ఏమిటని ప్రశ్నించారు. అనంతరం ఆయన గ్రామంలోకి వచ్చిన బ్యాక్వాటర్లో తెప్పను నడుపుకొంటూ ముంపునకు గురైన ఇళ్లను పరిశీలించారు. అనంతరం గండికోట ప్రాజెక్టును కూడా ఆయన సందర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు రామసుబ్బారెడ్డి, నరసింహారెడ్డి, సీపీఐ నాయకులు పాల్గొన్నారు.