భారతీయ సంస్కృతిని పెంపొందించేందుకే... యువజనోత్సవాలు
ABN , First Publish Date - 2020-12-11T05:12:41+05:30 IST
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు పెంపొందించేందుకు యువజనోత్సవాలు ఎంతగానో దోహదపడతాయని అడిషనల్ ఎస్పీ చక్రవర్తి, స్టెప్ సీఈవో రామచంద్రారెడ్డిలు పేర్కొన్నారు.
అడిషనల్ ఎస్పీ, స్టెప్ సీఈవో
కడప(మారుతీనగర్), డిసెంబరు 10: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు పెంపొందించేందుకు యువజనోత్సవాలు ఎంతగానో దోహదపడతాయని అడిషనల్ ఎస్పీ చక్రవర్తి, స్టెప్ సీఈవో రామచంద్రారెడ్డిలు పేర్కొన్నారు. యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో స్థానిక వైఎ్సఆర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవాల ముగింపు సమావేశం గురువారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా వారు హాజరై మాట్లాడారు. ప్రతి ఏడాది జనవరి 12న స్వామి వివేకానంద జన్మదినాన్ని పురస్కరించుకుని జాతీయ స్థాయిలో సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుండేదని తెలిపారు. గత సంవత్సరం వరకు జిల్లాలో యువజనోత్సవాలు నిర్వహించి అందులో గెలుపొందిన విజేతలకు జిల్లా స్థాయి పోటీలకు, ప్రథమ విజేతను రాష్ట్ర స్థాయి పోటీలకు పంపుతుండే వారమన్నారు. ప్రస్తుతం 2020-21 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ మేనేజింగ్ డైరెక్టరు విజయవాడ, జిల్లా కలెక్టరు ఆదేశాల మేరకు కొవిడ్-19 పరిస్థితుల దృష్ట్యా కేవలం జిల్లా స్థాయిలో యువజనోత్సవాలు నిర్వహిస్తున్నామని వివరించారు. కాగా ప్రతిభ కనబరిచిన వారికి మెమెంటో, ప్రశంసాపత్రాలు అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా టూరిజం అధికారి రాజశేఖరరెడ్డి, వైవీయూ కల్చరల్ హెచ్వోడీ డాక్టర్ రాంప్రసాద్రెడ్డి, ప్రొఫెసర్ పద్మావతి పాల్గొన్నారు.