పైసలిస్తేనే.. పరిహారం!
ABN , First Publish Date - 2020-12-01T06:07:48+05:30 IST
గండికోట ముంపు పరిహారంలో అక్రమాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. డబ్బులిచ్చిన వారికి ముందుగా పరిహారం ఇస్తున్నారని, నీళ్లలో మునుగుతున్నా తమకు పరిహారం ఇవ్వడం లేదంటూ పలువురు నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గండికోట ముంపు పరిహారంలో అక్రమాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. డబ్బులిచ్చిన వారికి ముందుగా పరిహారం ఇస్తున్నారని, నీళ్లలో మునుగుతున్నా తమకు పరిహారం ఇవ్వడం లేదంటూ పలువురు నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొండాపురం గ్రామానికి సంబంధించి 2066 మంది నిర్వాసితులకు పరిహారాన్ని మూడు నెలలుగా పంపిణీ చేస్తున్నారు. చెక్కులు ఇచ్చే ప్రక్రియలో చెక్ లిస్టులో పేర్లు రావాలంటే ముందుగా అధికారులకుడబ్బు ఇవ్వాల్సిందే ఆనే ఆరోపణలు ఉన్నాయి. నీళ్లలో మునుగుతున్న ఇళ్లకు పరిహారం ఇవకుండా డబ్బులు ఇచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని నిర్వాసితులు వాపోతున్నారు. తాళ్లప్రొద్దుటూరులో కూడా నీళ్లలో మునుగుతున్నా అర్హులైన కొంతమందికి పరిహారం ఇవ్వకుండా పెండింగ్లో ఉంచినట్లు నిర్వాసితులు తెలిపారు. ముందుగా డబ్బులు చెల్లించి అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్న వారికి అకౌంట్లలో డబ్బు చేస్తున్నారని అంటున్నారు. ప్రాధాన్యత క్రమంలో నీళ్లలో మునుగుతున్న వారికి చెక్కులు ఇవ్వాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై కొండాపురం మండల బీజేపీ కన్వీనర్ చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ ప్రాధాన్యత క్రమంలో కాకుండా డబ్బులు ఇచ్చినవారికి అందరి కంటే ముందే పరిహారం ఇస్తున్నారని, ప్రశ్నిస్తున్న తమలాంటి వారి చెక్కులను ఆపేస్తున్నారని అన్నారు. ఈ విషయంపై జమ్మలమడుగు ఆర్డీవో నాగన్న మాట్లాడుతూ ఇళ్లు ఖాళీ చేస్తామని ముందుకొచ్చిన వారి జాబితా విడుదల చేసి చెక్కులిస్తున్నామని చెప్పారు. ఇంకా కొందరు ఇళ్లు ఖాళీ చేస్తామని ముందుకొచ్చారని వారి జాబితా రావాల్సి ఉందన్నారు. ఈ వ్యవహారంపై విచారణ చేస్తున్నామని తెలిపారు.
- కొండాపురం