త్వరలోనే టెస్ట్ట్యూబ్ దూడలు
ABN , First Publish Date - 2020-09-03T11:22:38+05:30 IST
పులివెందుల వద్దనున్న ఏపీకార్ల్లో త్వరలోనే టెస్ట్ట్యూబ్ దూడలు ఉత్పత్తి కాబోతున్నాయి.

పుంగనూరు పశువుల ఉత్పత్తికి రూ.69.36 కోట్లు మంజూరు
పులివెందుల, సెప్టెంబరు 2: పులివెందుల వద్దనున్న ఏపీకార్ల్లో త్వరలోనే టెస్ట్ట్యూబ్ దూడలు ఉత్పత్తి కాబోతున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.69.36 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య జీవో విడుదల చేశారు. ఈ సందర్భంగా పశువుసంవర్ధక, పాడి అభివృద్ధి, మత్స్య శాఖ, శ్రీవేంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ‘మిషన్ పుంగనూరు రీసెర్చ్ ప్రాజెక్టు’ కింద పుంగనూరు దూడలను ఉత్పత్తి చేయనున్నారు.
ఐదు సంవత్సరాలుండే ఈ ప్రాజెక్టుకు సంబంధించి రూ.69.36 కోట్లు వ్యయం చేయనున్నారు. ఇందులో ఇన్-వివో, ఇన్-విట్రో పిండం ఉత్పత్తి ద్వారా మేలు జాతి పుంగనూరు జాతి పశువులను ఉత్పత్తి చేయనున్నారు. గతంలోనే అమెరికాకు చెందిన ఓ కంపెనీ ఏపీకార్ట్లో టెస్ట్ట్యూబ్ దూడలను ఉత్పత్తి చేసేందుకు ముందుకొచ్చింది. కానీ ఆ సంస్థ పరిశోధనల వరకు రాకుండానే ఆగిపోయింది. ప్రస్తుత ప్రభుత్వం ఏపీకార్ల్ను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే పుంగనూరు జాతి పశువుల ఉత్పత్తి జరగనుంది.