ఇన్‌చార్జ్‌ కమిషనరుగా ధర్మచంద్రారెడ్డి

ABN , First Publish Date - 2020-12-12T05:27:30+05:30 IST

కడప కార్పొరేషన్‌ ఇన్‌చార్జ్‌ కమిషనరుగా జేసీ (సంక్షేమం) ధర్మచంద్రారెడ్డిని నియమిస్తూ కలెక్టరు హరికిరణ్‌ ఆదేశాల జారీ చేశారు.

ఇన్‌చార్జ్‌ కమిషనరుగా ధర్మచంద్రారెడ్డి
పరిశీలిస్తున్న జేసీ, ఇన్‌చార్జ్‌ నగరపాలక కమిషనరు ధర్మచంద్రారెడ్డి

కడప(ఎర్రముక్కపల్లె), డిసెంబరు 11: కడప కార్పొరేషన్‌ ఇన్‌చార్జ్‌ కమిషనరుగా జేసీ (సంక్షేమం) ధర్మచంద్రారెడ్డిని నియమిస్తూ కలెక్టరు హరికిరణ్‌ ఆదేశాల జారీ చేశారు. ఈ మేరకు కార్పొరేషన్‌ కమిషనరు ఛాంబరులో ఇన్‌చార్జ్‌ కమిషనరుగా ధర్మచంద్రారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అయితే ఇన్‌చార్జ్‌ కమిషనరుగా అడిషనల్‌ కమిషనరు సుబ్బారావును నియమిస్తూ టీడీఎంఏ శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేసినట్లు తెలిసింది. 

కాలనీల్లో సౌకర్యాల పునరుద్ధరణ

పక్కీరుపల్లె చెరువు సమీపంలోని కాలనీలో చేరిన వర్షం నీటిని తొలగించి రవాణా సౌకర్యాలను పునరుద్ధరించామని జేసీ (సంక్షేమం), ఇన్‌ఛార్జ్‌ నగరపాలక శాఖ కమిషనరు ధర్మచంద్రారెడ్డి పేర్కొన్నారు. నగర శివార్లలోని పక్కీరుపల్లె చెరువు ప్రాంతంలోని కృష్ణదేవరాయనగర్‌, ఆర్టీసీ కాలనీ, ఫరీదానగర్‌, శ్రీనగర్‌కాలనీల్లోకి నీరు చేరినట్లు పత్రికల్లో వార్త రావడంతో కలెక్టరు వెంటనే స్పందించి అక్కడ పరిస్థితులను పరిశీలించి చక్కబెట్టాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. ఈ మేరకు శుక్రవారం మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ అధికారులతో కలిసి తదితర ప్రాంతాల్లో పరిశీలించారు. వాస్తవానికి అక్కడ చెరువు పొంగి నీరు పారలేదని, పై ప్రాంతాల్లో అధిక వర్షపాతం కారణంగా భారీగా వర్షం నీరు లోతట్టు కాలనీల్లోకి వచ్చి చేరిందన్నారు. చెరువులో నీరు సాధారణ మట్టంలోనే ఉందని, అలుగు నీరు మాత్రమే అక్కడ వీధుల్లో నిలిచిందని తెలిపారు. అలాగే అదే ప్రాంతంలో ఉన్న గ్యాస్‌ గోడౌన్‌ రవాణాకు నీరు నిలిచి ఆటంకం కలిగిందని, ప్రస్తుతం జేసీబీలతో పక్కీరుపల్లె పరిసర ప్రాంతాల నుంచి రాజంపేట ప్రధాన రహదారి వరకు అన్ని రహదారుల మరమ్మతులు చేపట్టామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-12T05:27:30+05:30 IST