అనుమానాస్పద స్థితిలో పందుల కాపరి మృతి
ABN , First Publish Date - 2020-11-16T05:04:50+05:30 IST
తాళ్లప్రొద్దుటూరు గ్రామానికి చెందిన డేరా బాలన్న (60)అలియాస్ ఎర్రన్న ఆదివారం గండికోట బ్యాక్వాటర్లో పడి మృతిచెందాడు.

కొండాపురం, నవంబరు 15: తాళ్లప్రొద్దుటూరు గ్రామానికి చెందిన డేరా బాలన్న (60)అలియాస్ ఎర్రన్న ఆదివారం గండికోట బ్యాక్వాటర్లో పడి మృతిచెందాడు. పోలీసులు, బంధువుల వివరాల మేరకు.. బాలన్నకు స్థానిక అంకాళమ్మ ఆలయం సమీపంలో మూడు ఇళ్లు ఉన్నాయి. ఇతనికి సంబంధించిన (ఇంటి నంబర్లు టి506, టి507, టి508) ఇళ్లకు పరిహారం అందలేదు. ఇళ్లతో పాటు తన పందుల షెడ్డు కూడా బ్యాక్వాటర్లో మునిగిపోయింది. తనకు పరిహారం అందలేదని గతంలో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డితో కలిసి కలెక్టర్కు విన్నవించారు. పరిహారం అందకపోవడంతో తీవ్ర ఆందోళన చెందేవాడు. ఈ నేపథ్యంలో ఆదివారం బ్యాక్వాటర్లో మునిగిన పందులషెడ్డును తీసి మరోచోటికు మార్చేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో నీళ్లలో మునిగిన పందుల షెడ్డును చూసి ఆవేదనతో గుండెపోటుకు గురై మృతిచెందాడని బంధువులు పేర్కొన్నారు. కాగా పందుల షెడ్డును ఊడగొట్టేందుకు వెళ్లి వస్తూ నీళ్లలో ఊపిరాడక మృతిచెందాడని తాళ్లప్రొద్దుటూరు ఎస్ఐ విద్యాసాగర్ తెలిపారు. ఇతనికి ఇద్దరు భార్యలు, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తాళ్లప్రొద్దుటూరు ఎస్ఐ వివరించారు.