పి.అనంతపురం గ్రామానికి పరిహారం ఇవ్వరా..?
ABN , First Publish Date - 2020-12-29T05:03:56+05:30 IST
గండికోట ముంపునకు గురైన అన్ని గ్రామాలకు పరిహారం ఇస్తున్నా పి. అనంతపురం గ్రామానికి ఎందుకు ఇవ్వరని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయశ్రీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయశ్రీ
కొండాపురం, డిసెంబరు 28: గండికోట ముంపునకు గురైన అన్ని గ్రామాలకు పరిహారం ఇస్తున్నా పి. అనంతపురం గ్రామానికి ఎందుకు ఇవ్వరని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయశ్రీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గ్రామంలో ఇటీవల హత్యకు గురైన ప్రతా్పరెడ్డి కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. హత్య జరిగి ఒకటిన్నర నెల కావస్తున్నా గ్రామంలో ఇంకా ఎందుకు విచారణ జరపలేదన్నారు. గ్రామంలో గండికోట బ్యాక్వాటర్ చుట్టుముట్టి బాత్రూంలలోకి నీరు చేరేంత వరకు ఎందుకు పరిహారం ఇవ్వలేదన్నారు. అక్రమాలపై విచారణ జరిపి వెంటనే పరిహారాన్ని ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. అదేవిధంగా తాళ్లప్రొద్దుటూరు పునరావాసంలో నిర్వాసితుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. ఉన్నఫలంగా వెళ్లగొట్టడం వలన ఆరుబయట సామాన్లు పడేసి పిల్లాపాపలతో, పశువులతో ఆరుబయట జీవిస్తున్న తీరు దారుణమన్నారు. కరెంటు కనెక్షన్లు కూడా సరిగా ఇవ్వలేదని, నీళ్లు కూడా సరిగా రావడం లేదని నిర్వాసితులు ఆమెతో చెప్పారు. అర్హులైనప్పటికి ముంపునకు గురైన చాలా గ్రామాల్లో పరిహారం రాలేదని, వెంటనే అర్హులైన అందరికి పరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు.