స్టీల్ ఫ్యాక్టరీ పనులు వెంటనే చేపట్టాలి
ABN , First Publish Date - 2020-05-17T11:15:59+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్థాపించనున్న ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ నిర్మాణ పనులను వెంటనే

అధికారులను ఆదేశించిన కలెక్టర్ హరికిరణ్
కడప (కలెక్టరేట్), మే 16 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్థాపించనున్న ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని కలెక్టర్ సి.హరికిరణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ నిర్మాణ పనుల కార్యాచరణపై శని వారం కలెక్టరేట్లోని తన ఛాంబరులో ఆ సంస్థ ఎండీ షన్మోహన్, చైర్మన్ మధుసూదనరెడ్డి, ముఖ్య సలహాదారులైన పారిశ్రామికవేత్త రాజోలి వీరారెడ్డితో కలసి సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ ఫ్యాక్టరీ పనులకు సంబంధించి ప్రధానంగా ప్రహరీగోడ, రోడ్లు, మంచినీటి వసతి, విద్యుత్ సరాఫరా కల్పించాల్సి ఉందన్నారు. పనుల నిర్మాణాలను జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో చేపడతామని, ఇప్పటికే 3 వేల ఎకరాలను సేకరించామని తెలిపారు.
ఆర్అండ్బీ, అటవీ శాఖల పరిధులు, నిబంధనలు పరిగణలోకి తీసుకుంటూ నిర్మాణ పనులను చేపడతామన్నారు. రహదారుల పనుల కోసం సర్వే డిపార్ట్మెంట్ ద్వారా సర్వే చేస్తూ స్థలాలను గుర్తించి లేఅవుట్లు వేయాలన్నారు. రోడ్లు, ప్రహరీగోడల నిర్మాణాలకు సంబంధించి డీపీఆర్లు సిద్ధం చేసి టెండర్లను ఆహ్వానించాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. వెంటనే గండికోట, మైలవరం రిజర్వాయర్ల నుంచి, ఆర్టీపీపీ నుంచి పైప్లైన్ల ద్వారా నీరు అందించేందుకు పనులు చేపట్టాలన్నారు. అలాగే విద్యుత్కు సంబంధించి 33 కేవీ సబ్స్టేషన్ పనులను ప్రారంభించాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ గౌతమి, జమ్మలమడుగు ఆర్డీఓ నాగన్న, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.