ప్రజలను నిలువునా ముంచారు
ABN , First Publish Date - 2020-12-02T04:42:39+05:30 IST
ప్రభుత్వం, అధికారుల వైఫల్యం కారణంగా కడప నగర ప్రజలను నిట్టనిలువునా వరదనీటితో ముంచారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బి.హరిప్రసాద్ ఆరోపించారు.

ప్రతీ కుటుంబానికి 20 వేల రూపాయలు ఇవ్వాలి
దుప్పట్లు, ఆహార పొట్లాల పంపిణీలో టీడీపీ నేత హరిప్రసాద్
కడప (మారుతీనగర్), డిసెంబరు 1: ప్రభుత్వం, అధికారుల వైఫల్యం కారణంగా కడప నగర ప్రజలను నిట్టనిలువునా వరదనీటితో ముంచారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బి.హరిప్రసాద్ ఆరోపించారు. మంగళవారం ఆయన స్థానిక హరిటవర్స్లో వరద బాధితులు వెయ్యిమందికి దుప్పట్లు, ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తుఫాను వలన నగరంలోని లోతట్టుప్రాంతాల ప్రజలు సర్వస్వాన్ని కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డున పడ్డారన్నారు. బాధిత కుటుంబాలకు 500 రూపాయలు చేతిలో పెట్టి ప్రభుత్వం చేతులు దులుపుకోవడం సిగ్గుచేటన్నారు. 2001లో కడపలో వరద బాధితులకు నాటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రతీ కుటుంబానికి 20 వేలను నష్టపరిహారంగా అందించామని ఆయన గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో వరద బాదితులను ఆదుకోవాలేగాని వారితో డ్రామాలాడడం అన్యాయమన్నారు. విపక్షాలు వేలెత్తి చూపకముందే ప్రతీ కుటుంబానికి 20 వేల రూపాయలను పరిహారంగా అందించాలని డిమాండ్ చేశారు. లేకుంటే బాధితులను ఏకం చేసి పోరుబాట పడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు అనిల్, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.