కడపలో భయంభయం

ABN , First Publish Date - 2020-11-27T07:05:02+05:30 IST

బుగ్గవంక ప్రాజెక్టు నీటితో నిండిపోయింది. ప్రాజెక్టులోకి 19వేల క్యూసెక్కుల నీరు చేరుతుండడంతో అధికారులు వచ్చిననీటిని వచ్చినట్టే బయటికి వదులుతున్నారు.

కడపలో భయంభయం
సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న కలెక్టర్‌, ఇతర అధికారులు

బుగ్గవంకలో 35వేల క్యూసెక్కుల నీళ్లు

లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్‌

8 పునరావాసం కేంద్రాలు ఏర్పాటు

2వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు

కడప, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): నివర్‌ తుఫాను కడప నగరంపై తీవ్ర ప్రభావం చూపింది. వర్షం ఆగకుండా కురుస్తుండడంతో బుగ్గవంక ప్రాజెక్టు నీటితో నిండిపోయింది.  ప్రాజెక్టులోకి 19వేల క్యూసెక్కుల నీరు చేరుతుండడంతో అధికారులు వచ్చిననీటిని వచ్చినట్టే బయటికి వదులుతున్నారు. అలాగే సీకేదిన్నె మండలం నుంచి వచ్చే మూలవంక నుంచి మరో 15వేల క్యూసెక్కుల నీళ్లు బుగ్గవంకలో కలుస్తున్నాయి. మొత్తంగా బుగ్గవంకలో దాదాపు 35వేల క్యూసెక్కుల నీళ్లు ప్రవహిస్తున్నాయి. దీంతో రవీంద్రగర్‌లోని సినిమాథియేటరు వరకూ, ఇటు బాలాజీనగర్‌ వరకూ నీరు చేరింది. ఇంకా పెద్ద వర్షం వస్తే ముంపునకు గురవుతామన్న భయం స్థానికుల్లో నెలకొంది. నాగరాజుపేట, రవీంద్రనగర్‌, మరాఠీ వీధి, బిస్మిల్లా నగర్‌, ఓల్డ్‌రిమ్స్‌ ఏరియా ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. జలమయమైన ప్రాంతాల్లో గురువారం రాత్రి కలెక్టర్‌ హిరికిరణ్‌, జాయింట్‌ కలెక్టర్లు సాయికాంతవర్మ, గౌతమి, సబ్‌కలెక్టర్‌ పృథ్వీతేజ్‌ పర్యటించారు. బాధితులకోసం 8 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి దాదాపు 2000 మందిని లోతట్టు ప్రాంతాల నుంచి అక్కడకు తరలించారు. నీళ్లు ఇంకా పెరిగే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారంతా ఖాళీచేసి పునరావాస కేంద్రాలకు వెళ్లాలని హెచ్చరించారు. బాధితులకోసం రెండు మరబోట్లు, రెస్క్యూటీంల ను సిద్ధంగా ఉంచారు. కాగా గురువారం ఉదయం సీఎ్‌సఐ చర్చి ఎదురుగా ఉన్న భారీ వేపచెట్టు నేలకొరిగింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. డీఎస్పీ సునీల్‌కుమార్‌ దగ్గరుండి చెట్టును తొలగింపజేశారు. కడప వ్యవసాయశాఖ ఏడీ కార్యాలయంలోకి నడుము లోతు నీరు వచ్చింది.

Updated Date - 2020-11-27T07:05:02+05:30 IST