యువతిని పోలీసులు సంరక్షిస్తున్న వీడియో వైరల్.. కరోనా పాజిటివ్‌ అంటూ తప్పుడు పోస్టింగ్స్‌

ABN , First Publish Date - 2020-03-25T16:28:35+05:30 IST

నరసరావుపేటలోని ప్రకాశ్‌నగర్‌లో ఓ మానసిక దివ్యాంగురాలికి కరోనా పాజిటివ్‌ వచ్చిందంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన యువకుడిపై నరసరావుపేట వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. పోలీసులు తెలిపిన వివరాలివి...

యువతిని పోలీసులు సంరక్షిస్తున్న వీడియో వైరల్.. కరోనా పాజిటివ్‌ అంటూ తప్పుడు పోస్టింగ్స్‌

నరసరావుపేటలో కేసు నమోదు... 

పోలీసుల అదుపులో నిందితుడు


గుంటూరు (ఆంధ్రజ్యోతి): నరసరావుపేటలోని ప్రకాశ్‌నగర్‌లో ఓ మానసిక దివ్యాంగురాలికి కరోనా పాజిటివ్‌ వచ్చిందంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన యువకుడిపై నరసరావుపేట వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. పోలీసులు తెలిపిన వివరాలివి... పట్టణానికి చెందిన ఓ మానసిక వికలాంగురాలు అటు ఇటు తిరుగుతూ ప్రకాశ్‌నగర్‌ ప్రాంతానికి చేరుకుంది. ఇది గమనించిన ఆ ప్రాంతానికి చెందిన మిట్టపల్లి రమేష్‌ అనే వ్యక్తి కరోనా అనుమానంతో నరసరావుపేట కార్పొరేషన్‌ మున్సిపల్‌ కమిషనర్‌ బి.శివారెడ్డికి సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన నరసరావుపేట వన్‌టౌన్‌ సిఐకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ఆ బాలికను సంరక్షించి ఆసుపత్రి తీసుకు వెళ్లి పరీక్షలు చేయించారు. 


అనంతరం ఆ యువతిని తండ్రికి అప్పగించారు. అయితే ప్రకాశ్‌ నగర్‌లో ఆ యువతిని పోలీసులు సంరక్షిస్తున్న సమయంలో ఈ మొత్తం దృశ్యాన్ని అదే ప్రాంతానికి చెందిన నందిగామ వంశీ అనే యువకుడు తన సెల్‌ఫోన్‌లో వీడియో తీసి ఆమెకు కరోనా వైరస్‌ సోకినట్లు పాజిటివ్‌ కేసుగా ప్రచారం చేశాడు. ఈ ఘటనపై నరసరావుపేట వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరు పరచనున్నట్లు పోలీస్‌ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా రూరల్‌ ఎస్పీ విజయరావు మాట్లాడుతూ రూరల్‌ జిల్లా పరిధిలో కరోన వైరస్‌పై తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - 2020-03-25T16:28:35+05:30 IST