జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2020-07-27T10:46:38+05:30 IST
కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తోన్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని పలువురు నాయకులు

రౌండ్టేబుల్ సమావేశంలో పలువురి డిమాండ్
గుంటూరు, జూలై 26 (ఆంధ్రజ్యోతి): కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తోన్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని పలువురు నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం గుంటూరులోని సీపీఐ కార్యాలయంలో ఏపీయూడబ్ల్యూజే, ఏపీఈఎంఏ ఆధ్వర్యంలో రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. తొలుత రాష్ట్రంలో ఇటీవల కరోనాతో మృతి చెందిన జర్నలిస్టుల ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం తెలిపారు. అనంతరం మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ప్రతి జర్నలిస్టు కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షల కొవిడ్ ఇన్సూరెన్స్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన జర్నలిస్టు కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం అందజేయాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకుడు మస్తాన్వలి మాట్లాడుతూ విఽధి నిర్వహణలో భాగంగా కరోనా భారిన పడి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టు కుటుంబాలకు రూ.25 వేల చొప్పున పరిహారం అందజేయాలని కోరారు. వైసీపీ, జనసేన, కాంగ్రెస్ నాయకులు ఆనం సంజీవరెడ్డి, రమాదేవి, రోహిత్ మాట్లాడుతూ జర్నలిస్టులు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు వీడియో కాల్ ద్వారా మాట్లాడుతూ అడిగిన, అడగని వర్గాలకు వరాలు ఇస్తున్న సీఎం జగన్ ఒక్క జర్నలిస్టులను మాత్రమే పట్టించుకోవడం లేదన్నారు.
జిల్లా అధ్యక్షుడు మీరా, కార్యదర్శి శివ, రాష్ట్రనేత భాస్కర్రెడ్డి మాట్లాడుతూ పెండింగులో ఉన్న జర్నలిస్టుల హెల్త్ స్కీం, ప్రమాద బీమాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎలకా్ట్రనిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు రాంబాబు, నాయకులు భక్తవత్సలం మోహన్, కుమార్రాజా, మధు, తదితరులు పాల్గొన్నారు.