రద్దీ తగ్గకపోవడానికి కారణమిదే!
ABN , First Publish Date - 2020-03-29T14:47:13+05:30 IST
జనతా కర్ఫ్యూకి ముందు రోజు వరకు..
అవసరాలకు మించి కొనుగోళ్లు
మార్కెట్ల వద్ద విపరీతమైన రద్దీ
గుంటూరు(ఆంధ్రజ్యోతి): జనతా కర్ఫ్యూకి ముందు రోజు వరకు జిల్లాలో ఎక్కువ మంది కూరగాయల కోసం రైతు బజార్లు /మార్కెట్లకు ఒకసారి వెళ్లేవారు. నిత్యావసర సరుకులకు అయితే కిరాణ షాపులకు రెండు, మూడు వారాలకు ఒకసారి మాత్రమే అవసరం ఏర్పడేది. అలాంటిది లాక్డౌన్ ప్రకటించిన రోజు నుంచి అవసరం లేకపోయినా ప్రతీ కుటుంబంలో ఎవరో ఒకరు నిత్యం కూరగాయల మార్కెట్లు, కిరాణా షాపులకు వస్తున్నారు. కూరగాయలు అయితే రెండు వారాలకు సరిపడా కొనుగోలు చేసి ఇళ్లకు తీసుకెళుతున్నారు. నిత్యావసర సరుకులు అయితే రెండు నెలలకు సరిపడా కొనుగోలు చేస్తున్నారు. షుగర్, బీపీ తదితర వ్యాధిగ్రస్తులు కూడా నెలకు సరిపడా ఔషధాలు కొనుగోలు చేస్తుండటం వలన ఆయా మార్కెట్లలో నిత్యం రద్దీ తలెత్తుతోన్నది.
కేంద్రప్రభుత్వం తొలుత జనతాకర్ఫ్యూ ప్రకటించింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వారం పాటు లాక్డౌన్ ప్రకటించింది. మరో రెండు రోజుల వ్యవధిలో కేంద్రం మళ్లీ 21రోజుల పాటు లాక్డౌన్ అమలులోకి తీసుకొచ్చింది. ఈ కారణంగా ఏప్రిల్ 14వ తేదీ తర్వాత లాక్డౌన్ ఎత్తి వేస్తారన్న నమ్మకం ప్రజల్లో కలగడం లేదు. ఆ తర్వాత కూడా లాక్డౌన్ కొనసాగవచ్చని భావిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం కేంద్ర ఆర్థిక మంత్రి మూడు నెలలకు ఆర్థికసాయం ప్రకటించడమే. దీనిని పరిగణనలోకి తీసుకొంటూ పప్పులు, నూనెలు, బియ్యం, ఉల్లిపాయలు, సబ్బులు, పేస్టులు, సర్ఫు పౌడర్లు వంటివి రెండు నెలలకు సరిపడా కొనుగోలు చేసేందుకు మార్కెట్లకు వస్తున్నారు.
ప్రభుత్వం ఒకమాట... పోలీసులు మరోమాట
నిత్యావసరసరుకులు విక్రయించే దుకాణాలు ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు తెరిచి ఉంటాయని ఒక పక్క సీఎం జగన్తో పాటు మంత్రులు, చీఫ్ సెక్రటరీ, డీజీపీ చెబుతోన్నారు. అయితే ఇక్కడ జిల్లా పోలీసులు మాత్రం అవేమి కుదరవని ఉదయం 9గంటలకే షాపులన్నీ మూతవేయాలని ఆదేశిస్తున్నారు. అంతేకాదు సీఐలు, ఎస్ఐలు సిబ్బందితో షాపుల వద్దకు వెళ్లి లాఠీలు ఝుళిపిస్తున్నారు. దీంతో నిత్యావసర సరుకులు దొరికేవి ఉదయం మూడు గంటలు మాత్రమేనన్న నిర్ణయానికి ప్రజలు వచ్చేశారు. ఈ కారణంగానే రద్దీ తగ్గడం లేదు.