భళా.. బాల
ABN , First Publish Date - 2020-03-16T07:12:35+05:30 IST
రాజధాని అమరావతి ఉద్యమంలో చిన్నారులు మేము సైతం అంటూ పాల్గొంటున్నారు.
రాజధాని చిన్నారులు సైతం ఉద్యమ బాట
శిబిరాల్లోనే పరీక్షలకు సిద్ధం
వివిధ కళారూపాలతో ఆటపాటలు
పెద్దలకు స్ఫూర్తిగా నిలుస్తున్న పిల్లలు
గుంటూరు, తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి, మార్చి 15(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి ఉద్యమంలో చిన్నారులు మేము సైతం అంటూ పాల్గొంటున్నారు. ఆదివారం సెలవుదినం కావటంతో మహిళలు తమ పిల్లలను శిబిరాలకు తీసుకొచ్చి అక్కడే చదివించుకున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తమ జీవితాలు చిందరవందరయ్యాయన్నారు. ప్రభుత్వం పెట్టిన పరీక్షలను తట్టుకొని ఓర్పుతో శాంతి మార్గం అనుసరిస్తూ అమరావతిని సాధిస్తామని రైతులు, మహిళలు ధీమా వ్యక్తం చేశారు. అలానే తుళ్లూరు దీక్షా శిబిరంలో చిన్నారులు సీఎం పోటో ఉన్న వ్యక్తి వద్ద తమ భవిష్యత్తును నాశనం చేయవద్దంటూ నినాదాలు చేశారు. రాయపూడిలో జై అమరావతి అంటూ చిన్నారి విద్యార్థులు నినాదాలు చేశారు.
వేదిక ఏదైనా తమ నినాదం జై అమరావతే అన్నట్లుగా 29 గ్రామాల ప్రజలు ముందుకు సాగుతున్నారు. మందడంలో పెద్ది నరహరిసాయి పంచల వేడుకకు హాజరైన గ్రామస్థులు చేతిలో జై అమరావతి ప్లకార్డులు, మెడలో పచ్చ కండవాతో ఆశీర్వదించారు. అమరావతే మా భవిష్యత్తు అని తేల్చిచెప్పారు. అలానే అమరావతి పరిరక్షణకు ఉద్యమం చేస్తున్న రైతులకు తణుకువాసి వట్టికూటి సత్యనారాయణ మద్దతు తెలిపి రూ.50వేలు ఆర్థిక సహాయం అందించింది. మందడం శిబిరానికి నరసాయిపాలేనికి చెందిన బసవపున్నమ్మ రెండు బంగారు గాజులను విరాళంగా అందజేశారు. గుంటూరుకు చెందిన ప్రొఫెసర్లు రూ.10 వేలు రైతు జేఏసీ సభ్యులకు అందజేశారు.