టీచర్ మందలించిందని విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2020-02-12T11:25:29+05:30 IST
ఉపాధ్యాయురాలు మందలించిందని మనస్థాపంతో 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన నూజెండ్లలోని
![టీచర్ మందలించిందని విద్యార్థిని ఆత్మహత్యాయత్నం](https://media.andhrajyothy.com/appimg/galleries/2020021205532320/02122020055448n77.jpg)
నూజెండ్ల, ఫిబ్రవరి 11 : ఉపాధ్యాయురాలు మందలించిందని మనస్థాపంతో 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన నూజెండ్లలోని కస్తూర్బా గురుకుల బాలికల విద్యాలయంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని బుర్రిపాలెం గ్రామానికి చెందిన మేకల అభినవజ్యోతి పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. మంగళవారం ఉదయం పరీక్ష అనంతరం క్లాస్ టీచర్ సుధారాణి అభినవ జ్యోతిని పిలిచి మార్కులు తక్కువగా వస్తున్నాయి, కష్టపడి చదవాలని మందలించింది. అదే పాఠశాలలో చదువుతున్న అభినవ జ్యోతి సోదరిల గురించి కూడా ప్రస్తావించి హేళన చేయటంతో ఇంటర్వెల్ సమయంలో అభినవజ్యోతి మెట్ల పైకి పరిగెత్తుకుంటూ వెళ్ళి మొదటి అంతస్థు నుంచి దూకింది. తీవ్రంగా గాయ పడిన విద్యార్థినిని నూజెండ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆస్పత్రికి వెళ్ళి విద్యార్థిని అభినవజ్యోతిని పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి మెరుగైన వైద్యం చేయించాలని సూచించారు.
విద్యార్థులతో సున్నితంగా వ్యవహరించాలి : ఎంఈవో
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎంఈవో సాంబశివరావు పాఠశాలను సందర్శించి స్పెషల్ అధికారి కే ఈశ్వరమ్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులను సంఘటనకు సంబందించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల పట్ల సున్నితంగా వ్యవహరించాలని, విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యార్థులకు ఎటువంటి దండన ఇవ్వటం, వారిని అవమానించే విధంగా మాట్లాడటం నేరమవుతుందన్నారు. ఈ సంఘటనకు కారణమైన ఉపాధ్యాయురాలికి మెమో ఇవ్వాలని ఆదేశించారు. పాఠశాలను ఐనవోలు ఎస్ఐ ఆర్ రవీంద్రారెడ్డి, సచివాలయ సిబ్బంది పరిశీలించారు.