చంద్రబాబు, లోకేష్పై నోరు పారేసుకుంటే ఉతికి ఆరేస్తాం
ABN , First Publish Date - 2020-06-05T09:25:32+05:30 IST
తమ అధినేత చంద్రబాబు, జాతీయ కార్యదర్శి..
టీడీపీ నేత యరపతినేని
గుంటూరు(ఆంధ్రజ్యోతి): తమ అధినేత చంద్రబాబు, జాతీయ కార్యదర్శి లోకేష్పై నోరు పారేసుకుంటే ఉతికి ఆరేస్తామని టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు హెచ్చరించారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయం నుంచి గురువారం ఆయన ఆన్లైన్లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. చంద్రబాబు వయసు గురించి విమర్శలు చేసేవారు ఆయనతో కలిసి తిరుమలకొండ ఎక్కేందుకు పోటీపడాలని సవాలు విసిరారు. ప్రజావ్యతిరేక విధానాలతో సీఎం జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆరోపించారు. శశికళ మాదిరిగా జగన్ జైలు కెళ్తే వైసీపీ కుక్కలు చింపిన విస్తరేనని అన్నారు. కోర్టుల తీర్పుల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే టీడీపీపై నిందలు వేస్తున్నారని ఆరోపించారు.
అమెరికాలో పౌర నిరసనలతో ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ బంకర్లో దాక్కున్నారని... ఏపీలో కూడా బంకర్లు ఏర్పాటు చేసుకునే పరిస్థితి సీఎం జగన్కు త్వరలోనే వస్తుందని ఎద్దేవా చేశారు. టీడీపీలో నాయకత్వానికి కొదవ లేదన్నారు. వైసీపీ నేతల మాదిరిగా దోచుకోవడం, అక్రమార్జనలో లోకేష్కు అనుభవం లేదన్నది వాస్తవమన్నారు. సీఎం చుట్టూ ఉన్నవారంతా అవకాశవాదులు కాదా...? అని యరపతినేని ప్రశ్నించారు. గతంలో ధర్మాన, బొత్స, ఇతర నాయకులు జగన్పై చేసిన విమర్శలను యరపతినేని చదివి వినిపించారు.