మైనార్టీలపై జరుగుతున్న దాడులు అరికట్టాలి

ABN , First Publish Date - 2020-11-13T06:54:13+05:30 IST

రాష్ట్రంలో మైనార్టీలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం అరికట్టాలని తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గ మహిళా ప్రధాన కార్యదర్శి షేక్‌ రిజ్వానా అన్నారు.

మైనార్టీలపై జరుగుతున్న దాడులు అరికట్టాలి
కొవ్వొత్తులతో ర్యాలీ చేస్తున్న మైనార్టీలు, టీడీపీ శ్రేణులు

గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ మహిళా ప్రధాన కార్యదర్శి రిజ్వానా


తాడికొండ నవంబరు 12: రాష్ట్రంలో మైనార్టీలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం అరికట్టాలని తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గ మహిళా ప్రధాన కార్యదర్శి షేక్‌ రిజ్వానా అన్నారు. నంద్యాలలో పోలీసుల వేధింపులకు ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. కేసును సీబీఐకి అప్పగించాలన్నారు. కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవటానికి కారణమైన పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సీఐ సోమశేఖర్‌పై పెట్టిన ఎఫ్‌ఐఆర్‌లో కేసులు తారుమారు చేశారని విమర్శించారు. సీఐని కేసు నుంచి తప్పించటానికి తప్పుడు సెక్షన్‌లు నమోదు చేశారని దుయ్యబట్టారు. అబ్దుల్‌ సలామ్‌ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. ముందుగా తాడికొండ పెద్ద మసీదు నుంచి బస్టాండ్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.

ఫిరంగిపురం

నంద్యాలలో అబ్దుల్‌ సలామ్‌ కుటుంబం యావత్తూ పోలీసుల దాష్టికానికి బలైపోయిన దుర్ఘటనకు నిరసనగా మండల టీడీపీ నాయకులు ఫిరంగిపురంలో అంబేద్కర్‌ విగ్రహం నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు కొవ్వొత్తుల ర్యాలీని జరిపారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సెల్‌ అధ్యక్షుడు పసల థామస్‌, పి.లూర్ధయ్య, కటికల అప్పారావు, మేకల నాగేశ్వరరావు, కోటా శేషు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-13T06:54:13+05:30 IST