కార్తీక మాసం.. తీరంలో నిబంధనలు
ABN , First Publish Date - 2020-11-13T05:47:23+05:30 IST
పవిత్ర కార్తీకమాసంలో సూర్యలంక సముద్ర తీరానికి వచ్చే భక్తులు, పర్యాటకులు కొవిడ్ నిబంధనలు పాటించాలని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సూచించారు.
సూర్యలంక తీరానికి పదేళ్ల లోపు, 70 ఏళ్ల పైబడిన వారికి అనుమతి లేదు
కుల సంఘాలు కార్తీక వన సమారాధనలు జరపరాదు
ఏర్పాట్లపై సమీక్షించిన డిప్యూటీ స్పీకర్ కోన రఘపతి
బాపట్ల, నవంబరు 12: పవిత్ర కార్తీకమాసంలో సూర్యలంక సముద్ర తీరానికి వచ్చే భక్తులు, పర్యాటకులు కొవిడ్ నిబంధనలు పాటించాలని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సూచించారు. రాను న్న కార్తీక మాసాన్ని పురస్కరించుకుని బాపట్ల మున్సిపల్ కార్యాలయంలో గురువారం జేసీ దినేష్కుమార్, సబ్ కలెక్టర్ మయూర్ అశోక్లతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోన మాట్లాడుతూ పదేళ్లలోపు పిల్లలు, 70 ఏళ్ల పైబడిన వృద్ధులకు సముద్రస్నానానికి అనుమతి లేదన్నారు. పర్యాటకులకు సాయంత్రం నాలుగింటి వరకే అనుమతి ఉందన్నారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తాగునీరు, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పార్కింగ్, సీసీ కెమెరాలు, గస్తీ నిర్వహణపై శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. అమసరమైనన్ని బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేస్తుందని తెలిపారు. కొవిడ్ కారణంగా తీరంలో కులసంఘాల కార్తీకవన సమారాధనలు జరపరాదని విజ్ఞప్తి చేశారు. జేసీ దినేష్కుమార్ మాట్లాడుతూ అధికారులు కమిటీలుగా ఏర్పడి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. తీరానికి వచ్చేవారంతా తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని చెప్పారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఎ. భానుప్రతాప్, తహసీల్దార్ కె.శ్రీనివాస్, డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు, సీఐలు కె.శ్రీనివాసరెడ్డి, బి.అశోక్కుమార్, ఎంపీడీవో ఎ.రాధాకృష్ణ, డిప్యూటీ తహసీల్దార్ జి.శ్రీచరణ్, రూరల్ ఎస్ఐ కిరణ్, ఆర్ఎంవో హాసీనా తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.