ఎన్నికల సాయంపై.. నిషేధం

ABN , First Publish Date - 2020-04-07T09:59:51+05:30 IST

కోవిడ్‌-19 సహాయక చర్యల పేరుతో ఏ ఒక్కరూ ఎన్నికల ప్రచారం నిర్వహించుకోకూడదని రాష్ట్ర ఎన్నికల సంఘం

ఎన్నికల సాయంపై.. నిషేధం

కరోనా సహాయక చర్యల పేరుతో రాజకీయ ప్రచారమా? 

చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు


గుంటూరు, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): కోవిడ్‌-19 సహాయక చర్యల పేరుతో ఏ ఒక్కరూ ఎన్నికల ప్రచారం నిర్వహించుకోకూడదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఏ ఒక్కరూ పార్టీ జెండాలు, ఫ్లెక్సీలతో ప్రచారం చేసుకోరాదని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో కలెక్టర్‌ తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఉత్తర్వులు పంపించారు. దీంతో ఇప్పటివరకు తమ సొంత ఖర్చులు పెట్టి కూరగాయలు, ఆహార పొట్లాలు, సరుకులు పంపిణీ చేస్తూ ప్రచారం చేసుకొంటోన్న రాజకీయ పార్టీ అభ్యర్థుల గొంతులో వెలగకాయ పడినట్లు అయింది.  కరోనా నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారు. అయితే అప్పటికే జడ్పీటీసీ, ఎంపీటీసీ, మునిసిపల్‌ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఈ క్రమంలో లాక్‌డౌన్‌లో ప్రజల సానుభూతి పొందేందుకు ఆయా అభ్యర్థులు వివిధ రకాలుగా ప్రయత్నిస్తోన్నారు. గుంటూరు నగరంలో పలు డివిజన్లలో అభ్యర్థులు కూరగాయల ప్యాకెట్లను డోర్‌ డెలివరీ చేస్తూ ప్రసార మాధ్యమాల్లో ప్రచారం చేసుకుంటున్నారు.


కొందరు భోజనం ప్యాకెట్లు, మరికొందరు బియ్యం, పప్పులు ఒక కిట్‌ తయారు చేసి ఇస్తున్నారు. ఇంకొందరైతే తమకు తెలిసిన వారితో సహాయం చేయిస్తూ అదేదో వీరే చేస్తోన్నట్లుగా హడావిడి చేస్తున్నారు. పెన్షన్లు, ప్రభుత్వ ఆర్థికసాయాన్ని వలంటీర్లు మాత్రమే ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయాలి. అయితే జిల్లాలో అందుకు విరుద్ధంగా వైసీపీ నాయకులు ఆ నగదును తీసుకుని పంచుతున్నారు. అలానే ఐసోలేషన్‌, క్వారంటైన్‌ వార్డులను రిబ్బన్‌ కత్తిరించి ప్రారంభిస్తున్నారు. వీటిపై ప్రతిపక్షాలు రాష్ట్ర ఎన్నికల సంఘం ఫిర్యాదుతో ఎస్‌ఈసీ స్పందించారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమలులో లేకపోయినా సరే ఇలాంటి చర్యలను అడ్డుకోవాలని ఆయన జిల్లా ఎన్నికల అధికారిని ఆదేశించారు.  

Updated Date - 2020-04-07T09:59:51+05:30 IST