ఆకలితో అలమటిస్తున్న బిచ్చగాళ్ళు
ABN , First Publish Date - 2020-03-25T09:34:10+05:30 IST
కరోనా వైరస్ మహమ్మారి అన్నివర్గాల ప్రజలతో పాటు బిచ్చగాళ్ళపై కూడా పెనుప్రభావం చూపుతోంది.
గుంటూరు, మార్చి 24: కరోనా వైరస్ మహమ్మారి అన్నివర్గాల ప్రజలతో పాటు బిచ్చగాళ్ళపై కూడా పెనుప్రభావం చూపుతోంది. ఇప్పటికే రోజువారీ వ్యాపారులు, చిరు వ్యాపారులు, కూలీ పనులు చేసుకునేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్ధికంగా కష్టాలుఎదుర్కొంటున్నారు. గుంటూరు నగరంలో వందలాది మంది బిచ్చగాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. గతంలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆహారాన్ని అందించేవారు. లేదంటే కొందరు ఇళ్ళ వద్దే ఆహార పొట్లాలు తయారు చేసుకుని పంచి వెళ్ళేవారు.
అలాగే బిక్షాటన చేయగా వచ్చిన డబ్బుతో అవసరమైనవి కొనుక్కుని తినేవారు. ప్రస్తుతం కరోనా కారణంగా హోటళ్ళు, ఆలయాలు మూతపడ్డాయి. జనసంచారాన్ని సైతం కట్టడి చేశారు. ఫలితంగా బిచ్చగాళ్ళకు ఆహారం అందడం లేదు. కనీసం తాగడానికి మంచినీరు కూడా దొరకడం లేదు. ప్రస్తుతం నగరంలో వందలాది మంది బిచ్చగాళ్ళ పరిస్థితి దయనీయంగా మారింది. కొన్ని స్వచ్ఛంద సంస్థలు, దాతలు స్పందించి కొద్దిమందికి ఆహారం అందించగల్గుతున్నారు. అయితే అత్యధిక మందికి మాత్రం ఆకలితో అలమటిస్తున్నారు.