ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై ప్రత్యేక దృష్టి
ABN , First Publish Date - 2020-06-22T10:03:44+05:30 IST
గుంటూరు నగరంలో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉందని అర్బన్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన నగరంపాలెం,
కంటైన్మెంట్లలో రాకపోకలు నియంత్రించాలి
దిశ పోలీస్స్టేషన్లో కేసులు పరిష్కారానికి చర్యలు
అర్బన్ ఎస్పీ పర్యటన... దిశ పోలీస్స్టేషన్ తనిఖీ
గుంటూరు, జూన్ 21: గుంటూరు నగరంలో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉందని అర్బన్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన నగరంపాలెం, ఎంటీవీ సెంటర్, శంకర్విలాస్, లాడ్జి సెంటరు, కొరిటెపాడు, గుజ్జనగుండ్ల, పట్టాభిపురం ప్రాంతాల్లో ట్రాఫిక్ డీఎస్పీ వీవీ రమణకుమార్, వెస్ట్ ట్రాఫిక్ సీఐ వాసు, సీఐలు రాజశేఖరరెడ్డి, కోటేశ్వరరావులతో కలిసి పర్యటించారు. ట్రాఫిక్ సమస్య జఠిలంగా ఉందని, ఈ క్రమంలో మరికొన్ని ప్రదేశాల్లో సిగ్నల్ లైట్లు ఏర్పాటు చేయాల్సి ఉందని, ఆక్రమణలను తొలగించి రోడ్లను విస్తరించాల్సి ఉందని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారితోపాటు మాస్క్ లేకుండా రోడ్లపైకి వచ్చే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు.
గుంటూరులో కరోనా వైరస్ ఉధృతం అవుతున్న నేపథ్యంలో కంటైన్మెంట్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి రాకపోకలు కట్టడి చేయాలన్నారు. కంటైన్మెంట్లో ఉన్న వారిని ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకుండా చూడాలన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన దిశ పోలీస్స్టేషన్ తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. మహిళలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఆయా కేసుల్లో కోర్టులో వెంటనే చార్జిషీటు దాఖలు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మహిళా స్టేషన్ ఇన్చార్జి డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఎస్ఐలు ఖాజీబాబు, కోటయ్య తదితరులు పాల్గొన్నారు.