నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
ABN , First Publish Date - 2020-05-10T07:01:44+05:30 IST
రూరల్ జిల్లా పరిధిలో లాక్డౌన్ నిబందనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు రూరల్ ఎస్పీ విజయరావు స్పష్టం చేశారు.
![నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
రూరల్ ఎస్పీ విజయరావు
గుంటూరు, మే 9 : రూరల్ జిల్లా పరిధిలో లాక్డౌన్ నిబందనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు రూరల్ ఎస్పీ విజయరావు స్పష్టం చేశారు. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలలో వ్యాప్తి నివారణకు బారికేడింగ్ ఏర్పాటు చేయించి జనసంచారాన్ని పూర్తిగా కట్టడి చేశామన్నారు. రెడ్జోన్ ప్రాంతాల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. వారికి అవసరమైన నిత్యావసరాలు,మందులు వారివద్దకే పంపుతున్నామన్నారు. మిగిలిన ప్రాంతాలలో ఉదయం 6 నుంచి 9 గంటల మద్య సడలింపు సమయంలో నిత్యావసరాలకు మాత్రమే ప్రజలను రోడ్లపైకి అనుమతిస్తున్నామన్నారు. రెడ్జోన్ సహా అన్ని కూడళ్ళలో సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారిని గుర్తించి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ వివరించారు. మద్యం దుకాణాల వద్ద గొడుగులు తప్పనిసరి చేశామన్నారు.
నిబంధనలు ఉల్లంఘించిన 3,420 మందిపై కేసులు
లాక్డౌన్ ప్రారంబమైనప్పటి నుంచి ఇప్పటివరకు రూరల్ జిల్లా పరిధిలో 3,420 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ విజయరావు తెలిపారు.అలాగే 1935 వాహనాలు సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. 431 దుకాణాలపై కూడా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మోటారు వాహన చట్టం ప్రకారం 24,899 వాహనాలపై కేసులు నమోదు చేసి రూ.76,58,730 జరిమానా వసూలు చేసినట్లు తెలిపారు.