ధాన్యం లేకుండానే బియ్యం. నరసరావుపేటలో అక్రమార్కుల ఘనత
ABN , First Publish Date - 2020-10-03T16:40:40+05:30 IST
ధాన్యం లేదు.. రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయలేదు.. అయినా బియ్యం ఉత్పత్తి అవుతున్నది. అదెలా సాధ్యమంటే నరసరావుపేటలోనే అలా జరు గుతుంది.

రేషన్ బియ్యం సేకరించి పాలిష్తో విక్రయం
స్వప్న ట్రేడర్స్ మిల్లులో బియ్యం సీజ్ కేసు
విచారణపై పలు అనుమానాలు
నరసరావుపేట(గుంటూరు): ధాన్యం లేదు.. రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయలేదు.. అయినా బియ్యం ఉత్పత్తి అవుతున్నది. అదెలా సాధ్యమంటే నరసరావుపేటలోనే అలా జరు గుతుంది. కొందరు అక్రమార్కులు దీనిని చేసి చూపిం చారు. పేదలకు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న బియ్యం నిల్వలను కొట్టేయడం ద్వారా ధాన్యం లేకుం డానే బియ్యం ఉత్పత్తి జరుగుతున్నట్టు అధికారుల దర్యాప్తులో తేలింది. అధికారుల తనిఖీలలో పలు మార్లు ఈ గుట్టురట్టు అవుతున్నా.. వారిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సాహసం చేయడంలేదు.
రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండానే ప్రతి నెలా వేలాది క్వింటాళ్ల బియ్యం నరసరావుపేటలో ఉత్పత్తి అవుతున్నది. ఎలాంటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చేయగల సత్తా ఇక్కడి కొందరు అక్రమార్కుల సొంతం. పట్టణంలోని వినుకొండ, పల్నాడు రహదారుల కేంద్రంగా రేషన్ మాఫియా యథేచ్ఛగా చెలరేగుతున్నది. డీలర్ల నుంచి బియ్యం సేకరించి వీటికి ఒక పట్టు పాలిష్ చేసి బ్లాక్ మార్కెట్లో బహిరంగంగా విక్రయిస్తున్నారు. ఇటీవల రావి పాడు రోడ్డులోని స్వప్న ట్రేడర్స్ మిల్లులో వేలాది బస్తాల బియ్యం నిల్వలను అధికారులు సీజ్ చేశారు. అనంతరం కోర్టు ఉత్తర్వులతో రూ.67 లక్షల ష్యూరిటీతో వాటిని విడుదల చేసిన విషయం తెలిసిందే.
లోతుగా విచారణ జరపకుండానే..
ఏ మిల్లులోనేనా ధాన్యం ద్వారా బియ్యం ఉత్పత్తి చేస్తే బియ్యంతో పాటు నూకలు, తవుడు, ఊక ఉత్పత్తి అవుతుంది. ధాన్యం కొనుగోలు చేసి బియ్యం ఉత్పత్తి చేస్తున్నట్టుగా తనిఖీల్లో సదరు వ్యాపారులు అధికారులకు చూపించారు. దీనికి అధికారులు పూర్తి స్థాయి విచారణ జరపకుండానే వ్యాపారులు చెప్పిన దానికి తలఆడించి వచ్చారన్న విమర్శలున్నాయి. ధాన్యం కొనుగోలు చేసి మిల్లు వేసినట్టు వ్యాపారులు చూపిస్తే ఏ రైతు దగ్గర ధాన్యం కొన్నారు.. వాటి పర్మిట్లను అధికారులు పరిశీలిం చాలి. అలాగే కరెంట్ బిల్లుతో పాటు, తవుడు, నూక, ఊక విక్ర యాల రికార్డులను, బియ్యం నిల్వలను ఎవరికి విక్రయిం చారు.. అనే అంశాలను పౌర సరఫరాల శాఖ అధికారులు చూడాలి. ఇవేవి జరగకుండానే వ్యాపారులు చెప్పింది విని మిన్నకుండటం పలు అనుమానాలకు తావిస్తున్నది. పూర్తి స్థాయిలో విచారణ జరిపితే పేదల బియ్యం బ్లాక్ మార్కెట్, రీసైక్లింగ్ వెలుగు చూసే అవకాశం ఉండేదని పలువురు అభిప్రా యపడుతు న్నారు. స్వప్న ట్రేడర్స్ మిల్లులో 3,200 బస్తాలకు పైగా బియ్యం నిల్వలను సీజ్ చేసి విడుదల చేసినప్పటికి బియ్యం ఉత్పత్తికి సంబంధించి లోతుగా విచారణ జరగలేదన్న ఆరోపణలున్నాయి. అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తుల పాత్ర ఉండటంతో అధికారులపై ఉన్న ఒత్తిళ్ల వల్లే సమగ్ర దర్యాప్తు చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇదీ కొసమెరుపు..
స్వప్న ట్రేడర్స్లో సీజ్ చేసిన ప్రభుత్వ బియ్యం నిల్వలను వినుకొండరోడ్డులోని కామధేను ట్రేడర్స్ మేనేజింగ్ పార్టనర్ వీరంరెడ్డి పుల్లారెడ్డికి గత నెల 6న అప్పగించినట్టు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఎస్ పద్మశ్రీ ప్రకటన విడుదల చేశారు. ఈ నిల్వలను సీజ్ చేసిన స్వప్న ట్రేడర్స్లో కూడా వీరంరెడ్డి పుల్లారెడ్డి భాగస్వామి. 6 ఏ, రూరల్ పోలీసు స్టేషన్లో నమో దైన కేసులో ఆయన పేరు ఉంది. 10న జేసీ కోర్టులో జరిగే విచా రణకు కూడా వీరంరెడ్డి పుల్లారెడ్డితో పాటు ఆవుల శివారెడ్డి, బత్తుల బాలయ్యలకు నోటీసులు జారీ అయినట్టు తహసీల్దారు తెలిపారు. ఇలా బియ్యం అక్రమ నిల్వల కేసులో పేరు నమోదైన వీరంరెడ్డి పుల్లారెడ్డి ఆధ్వర్యంలోని మిల్లుకే సీజ్ చేసిన ప్రభుత్వ బియ్యం నిల్వలు అప్పగించడం ఈ కేసులో కొసమెరుపు. పుల్లా రెడ్డి నుంచి సీజ్ చేసిన బియ్యం నిల్వలను సదరు వ్యక్తి భాగ స్వామిగా ఉన్న స్వప్న ట్రేడర్స్కు విడుదల చేసినట్టు డీఎస్వో తెలిపారు. అక్రమ బియ్యం నిల్వల కేసులో ఉన్న వ్యక్తికి ఈ నిల్వలను అప్పగించడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటో సదరు అధికారులకే తెలియాలి. ఇలా అప్పగించవచ్చా అన్న అంశంపై ఫౌర సరఫరాల శాఖ ఏ విధంగా స్పందిస్తుందో లేక సమర్ధించుకుంటుందో చూడాలి.