రైతుల త్యాగాలకు అవమానం

ABN , First Publish Date - 2020-12-11T05:09:07+05:30 IST

రాజధాని కోసం 30 వేల ఎకరాలు కావాలని నాడు ప్రకటించి.. అధికారంలోకి రాగానే సీఎం జగన్‌ మాట మార్చారని రాజధాని రైతులు ఆరోపించారు.

రైతుల త్యాగాలకు అవమానం
మందడంలో ఆందోళన చేస్తున్న మహిళలు

 నాడు రాజధాని కోసం 30 వేల ఎకరాలు కావాలన్నారు..

నేడు అధికారంలోకి రాగానే మాట మార్చారు..

అమరావతిపై పాలకుల కుట్ర

359వ రోజుకు చేరిన రైతులు ఆందోళనలు 


తుళ్లూరు, డిసెంబరు 10: రాజధాని కోసం 30 వేల ఎకరాలు కావాలని నాడు ప్రకటించి.. అధికారంలోకి రాగానే సీఎం జగన్‌ మాట మార్చారని రాజధాని రైతులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళన గురువారం 359వ రోజుకు చేరింది. తుళ్లూరు, పెదపరిమి, నేలపాడు, దొండపాడు, మందడం, వెలగపూడి, ఐనవోలు, రాయపూడి, లింగాయపాలెం ఉద్దండ్రాయునిపాలెం, పెదపరిమి, అనంతవరం, బోరుపాలెం అబ్బరాజుపాలెం తదితర గ్రామాల రైతు దీక్షా శిబిరాల్లో ఆందోళనలు కొనసాగాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ న్యాయం కోసం వందల రోజులుగా రైతులు, మహిళలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. రైతులను ఉన్మాదులు, రాక్షసులుగా చిత్రీకరించడం సిగ్గుచేటన్నారు. పారిశ్రామికవేత్తలు రాష్ట్రం నుంచి పారిపోయేలా వ్యవహరించారన్నారు. అమరావతిని నిర్వీర్యం చేసేందుకు ప్రణాళికలు రచించి మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చారన్నారు. అమరావతి రైతులను నమ్మించి మోసం చేసిన ప్రస్తుత పాలకులకు శిక్ష ఎందుకు వేయకూడదని ప్రశ్నించారు.  మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, యర్రబాలెం, నవులూరు, బేతపూడి, నిడమర్రు, నీరుకొండ గ్రామాల్లో రైతుల రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. రైతు సంఘ నేతలు సందర్శించి మద్దతు తెలిపారు. రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక గ్రామాల్లో రైతులు, మహిళలు ఆందోళనలో పాల్గొన్నారు. తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో జరుగుతున్న రైతుల నిరసన దీక్షలు కొనసాగాయి. 


ఆగిన మరో రైతు గుండె

 రాజధాని తరలిపోతుందనే మనోవేదనతో తుళ్లూరుకు చెందిన రైతు  జమ్ముల గోపాలరావు(70) గురువారం మృతి చెందాడు. తనకున్న ఎకరం భూమిని ఆయన రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారు. ధర్నా శిబిరాల్లో కూడా ఆయన పాల్గొంటున్నారు.

Updated Date - 2020-12-11T05:09:07+05:30 IST