పోలీసుస్టేషన్ వద్ద ముస్లిం మైనారిటీల నిరసన
ABN , First Publish Date - 2020-07-08T10:04:04+05:30 IST
తమ వల్లే కరోనా వ్యాప్తి చెందుతుందని దుర్భాషలాడిన పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్చేస్తూ అమరావతికి చెందిన ముస్లింపెద్దలు,

అమరావతి, జూలై 7: తమ వల్లే కరోనా వ్యాప్తి చెందుతుందని దుర్భాషలాడిన పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్చేస్తూ అమరావతికి చెందిన ముస్లింపెద్దలు, యువకులు పోలీసుస్టేషన్ వద్ద మంగళవారం సాయంత్రం సీఐ విజయకృష్ణకు ఫిర్యాదుచేసి నిరసన తెలిపారు. సోమవారం కరోనా ప్రభావంతో రెడ్జోన్గా ఉన్న మెయిన్రోడ్లో దుకాణాలు మూసివుండగా అపోల మెడికల్షాపు తెరచివుండడంతో పోలీసు సిబ్బంది యజమానిపై ఆగ్రహం వ్యక్తంచేసి మూయించారు. ఇంతలో స్థానిక ముస్లిం నాయకులు వచ్చి మందుల దుకాణం మూయడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని వాగ్వాదానికి దిగడంతో సమాచారం తెలుసుకున్న ఎస్ఐ వచ్చి సర్దిచెప్పారు.
అనంతరం పోలీసు సిబ్బంది దుర్గా, శ్రీనివాసరావులు తమ విధులకు ఆటంకం కలిగించారని ముస్లిం నాయకుడు షేక్ జానీతో పాటు పలువురిపై కేసు నమోదుచేశారు. దీంతో మంగళవారం జానీతోపాటు వంద మందికి పైగా ముస్లింలు స్షేషన్ వద్దకు వచ్చి తమ మనోభావాలు దెబ్బతినేలా కానిస్టేబుళ్లు మాట్లాడారని సీఐకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పోలీసు విధులకు ఆటంకం కలిగించినందుకు, స్టేషన్ వద్దకు జానీ తన అనుచరులతో వచ్చి నిరసన తెలిపినందుకు, జానీతోపాటు పలువురు తమ సిబ్బందిపై చేసిన ఫిర్యాదుకు సంబంధించి మూడు కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.