సుఫారీ గ్యాంగ్తో వ్యాపారి హత్య!
ABN , First Publish Date - 2020-11-28T04:50:17+05:30 IST
మండలంలోని 75త్యాళ్లూరులో ఈనెల 4వ తేదీ రాత్రి జరిగిన హోటల్ యజమాని భాష్యం బ్రహ్మయ్య హత్యకు సంబంధించి పోలీసుల విచారణలో నిజాలు వెలుగు చూస్తున్నాయి.
ఏడాది కిందటే హత్యకు పథకం
పోలీసుల విచారణలో వెలుగుచూస్తున్న నిజాలు
75త్యాళ్లూరులో ఈ నెల 4న ఘటన
పెదకూరపాడు, నవంబరు 27: మండలంలోని 75త్యాళ్లూరులో ఈనెల 4వ తేదీ రాత్రి జరిగిన హోటల్ యజమాని భాష్యం బ్రహ్మయ్య హత్యకు సంబంధించి పోలీసుల విచారణలో నిజాలు వెలుగు చూస్తున్నాయి. బ్రహ్మయ్య మొఖంపై బంగారం మెరుగు పెట్టేందుకు ఉపయోగించే ఫటాష్ అనే పదార్ధం చల్లడంతో కొద్దిసేపటికే మృతి చెందాడని, ఇది సుఫారీ గ్యాంగ్ పనేనని తెలుస్తోంది. మృతుడి కుటుంబసభ్యులతో పరిచయం ఉన్న ఓ యువకుడు బ్రహ్మయ్యను హతమార్చేందుకు ఏడాది కిందటే పన్నాగం పన్నాడు. గ్రామానికి చెందిన మరో యువకుడితో కలసి మచిలీపట్నంకు చెందిన సుఫారీ గ్యాంగ్తో రూ.4 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో రెండుమూడు సార్లు రెక్కీ కూడా నిర్వహించారు. హత్య జరిగిన రాత్రి హోటల్లోని వ్యర్ధ పదార్ధాలను గ్రామ శివారులో పారవేసేందుకు బ్రహ్మయ్య వెళ్లాడు. అతని కంటే ముందే గ్యాంగ్కు చెందిన ఇద్దరు ఇక్కడికి చేరుకున్నారు. బ్రహ్మయ్య వ్యర్ధాలను పారబోసి తిరిగి ద్విచక్రవాహనం బయలుదేరుతున్నసమయంలో అతనిని కిందకు తోసి మొఖంపై ఫటాష్ చల్లారు. మొఖం మంట పుట్టడంతో భయబ్రాంతులకు గురైన బ్రహ్మయ్య సమీపంలోని బందువుల ఇంటికి వెళ్లి వారికి జరిగింది చెప్పాడు.. వెంటనే బ్రహ్మయ్యను వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. దీనిపై మృతుడి కుటుంబ సభ్యుల ఫోన్కాల్స్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుల్లోని కొందరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం.