400మందికి కొవాగ్జిన్ టీకా
ABN , First Publish Date - 2020-12-06T05:36:54+05:30 IST
గుంటూరు ప్రభుత్వ జ్వరాల ఆసుపత్రిలో ఇప్పటివరకు 400మందికి కొవాగ్జిన్ టీకాలు వేశారు.

గుంటూరు(మెడికల్), నవంబరు 30: గుంటూరు ప్రభుత్వ జ్వరాల ఆసుపత్రిలో ఇప్పటివరకు 400మందికి కొవాగ్జిన్ టీకాలు వేశారు. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) సౌజన్యంతో భారత్ బయోటెక్ సంస్థ ఆధ్వర్యంలో కరోనా క్లినికల్ ట్రయల్స్ నవంబరు 24న కలెక్టర్ శామ్యూల్ ఆనంద్కుమార్ ప్రారంభించారు. మొత్తం వెయ్యి మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. వలంటీర్లుగా పేర్లు నమోదు చేయించుకొని వ్యాక్సిన్ తీసుకుంటున్న వారిలో అధికారులు, ప్రైవేటు వైద్యరంగ డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది, వ్యాపారవేత్తలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో పాటు సామాన్యులు ఉండడం విశేషం. వలంటీర్లకు 0.5 ఎంఎల్ వ్యాక్సిన్ ఇంట్రా మస్క్యులర్గా ఇస్తారు. ఒక్కో వలంటీర్కు రెండు మోతాదుల్లో దీనిని చేస్తారు. జీరో డే, 28వ రోజున రెండుసార్లు టీకా మందు ఇచ్చి అనంతరం 60వ రోజున వీరిలో కరోనా యాంటీబాడీలు, ఇమ్యునోగ్లోబిలిన్ను పరిశీలిస్తారు. ఇవి నిర్ధేశిత ప్రమాణంలో ఉంటే వ్యాక్సిన్ సమర్ధంగా పని చేస్తున్నట్లే అని నిర్ధారిస్తారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఇప్పటివరకు ఎవరికీ దుష్షలితాలు కనిపించలేదని వైద్యాధికారులు తెలిపారు.