పేదలు ఆ భూములే అడిగారా?: జీవీ
ABN , First Publish Date - 2020-09-18T14:28:59+05:30 IST
వినుకొండలోని పేదలు ఇళ్ల స్థలాల కోసం బ్రహ్మనాయుడుకు చెందిన..

వినుకొండ(గుంటూరు): వినుకొండలోని పేదలు ఇళ్ల స్థలాల కోసం బ్రహ్మనాయుడుకు చెందిన 100 ఎకరాలను అడిగారా అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రశ్నించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదల పేరు చెప్పుకొని ఎమ్మెల్యే తన 100 ఎకరాల భూమిని రూ.18 కోట్లకు అమ్ముకున్నారన్నారు. ఆ ప్రాంతంలో కేవలం రూ.5 లక్షలు ఉంటే ఎకరా రూ.18 లక్షల చొప్పున ప్రజల సొమ్మును లూటీ చేశారని ఆరోపించారు.
పట్టణ ప్రాంత పేదలకు పట్టణంలోనే భూములు ఇచ్చే విషయాన్ని ఎమ్మెల్యే పునఃపరిశీలించాలన్నారు. టీడీపీ హయాంలో గ్రామాలను అభివృద్ధి చేసిన వారికి బిల్లులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. వేల్పూరులో పారా హైమారావు, అగ్నిగుండాలలో సుబ్బారావు బిల్లుల కోసం చచ్చే వరకు పోరాడారన్నారు. ప్రత్యేక అధికారులు బిల్లులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా కావాలనే ఎమ్మెల్యే క్వాలిటీ పేరుతో అడ్డుకుంటున్నారన్నారు. బొల్లా సైకోలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. విగ్రహాల తొలగింపునకు సంబంధించిన అంశం కోర్టు ఆర్డర్లో ఎక్కడా లేదన్నారు. విగ్రహాల తొలగింపుపై ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. రానున్న రోజుల్లో అదే ప్రాంతంలో అంబేడ్కర్, పూలే, ఎన్టీఆర్, పరిటాల విగ్రహాలను ఏర్పాటు చేసి తీరుతామన్నారు.
టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో చేపడుతున్న తిమ్మాయపాలెం ప్రధాన రహదారితో పాటు ఎన్ఎస్పీ కాలువ కట్టపై సిమెంటు రోడ్డు పనులు చేపడుతున్నట్లు ఈ ఎమ్మెల్యే చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. వినుకొండ తాగునీటి సమస్య పరిష్కారానికి గతంలోనే రూ.159కోట్లు మంజూరయ్యాయన్నారు. ఆ నిధులతో పైపులైన్, ఫైర్స్టేషన్ వద్ద ట్యాంక్ నిర్మాణం, చెరువు అభివృద్ధి వంటి పనులు జరుగుతున్నాయన్నారు. నియోజకవర్గంలోని ప్రతిగ్రామానికి, ప్రతి ఇంటికి నీరు చేరాలనే లక్ష్యంతో బుగ్గవాగు నుంచి నీరు తెచ్చేందుకు రూ.259 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేస్తే టెండర్లు పిలువకుండా ఎమ్మెల్యే అబద్ధాలు ఆడుతున్నారన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు సైదారావు, సిద్ధయ్య, కృష్ణారెడ్డి, షమీమ్ తదితరులు పాల్గొన్నారు.