గుంటూరు మిర్చియార్డు సెలవులు పొడిగింపు
ABN , First Publish Date - 2020-07-19T16:50:18+05:30 IST
జిల్లాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుండటంతో..

ఈ నెల 27న పునఃప్రారంభం
గుంటూరు(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుండటంతో మిర్చియార్డుకు సెలవులను ఈ నెల 27వ తేదీ వరకు పొడిగించారు. గతంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం సోమవారం యార్డు ప్రారంభం కావలసి ఉండగా రైతులు, హమాలీలు, వ్యాపారస్థుల శ్రేయస్సు దృష్ట్యా సెలవులను పొడిగిస్తున్నట్లు మిర్చియార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం తెలిపారు. జిల్లావ్యాప్తంగా 400 నుంచి 500 మధ్యన పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా యార్డు ఏర్పాటై ఉన్న గుంటూరు నగరంలో 250 కేసులకు ఏమాత్రం తగ్గడం లేదు. ఈ పరిస్థితుల్లో యార్డులో లావాదేవీలు ప్రారంభిస్తే వైరస్ ఇక్కడ కూడా విస్త్రృతంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొన్న మిర్చియార్డు చైర్మన్ వ్యాపారస్థులతో చర్చలు జరిపి యార్డు తెరిచే తేదీని వాయిదా వేశారు. ఈలోపు రైతులు ఎవ్వరూ సరుకుని యార్డుకు తీసుకురావొద్దని సూచించారు.