17న ఉద్దండరాయునిపాలెంలో భారీ బహిరంగ సభ: గద్దె తిరుపతిరావు
ABN , First Publish Date - 2020-12-11T19:41:18+05:30 IST
అమరావతి ఉద్యమం చేపట్టి డిసెంబర్ 17 నాటికి 365 రోజులు పూర్తి అవుతుందని అమరావతి పరిరక్షణ సమితి నాయకులు గద్దె తిరుపతిరావు తెలిపారు.
గుంటూరు: అమరావతి ఉద్యమం చేపట్టి డిసెంబర్ 17 నాటికి 365 రోజులు పూర్తి అవుతుందని అమరావతి పరిరక్షణ సమితి నాయకులు గద్దె తిరుపతిరావు తెలిపారు. అమరావతి పరిరక్షణకై ఈనెల 12న గుంటూరులో మహా పాదయాత్ర చేపట్టనున్నట్లు చెప్పారు. అమరావతి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి ఈనెల 12 నుంచి 17 వరకు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నెల 12న మధ్యాహ్నం 3 నుంచి 5 వరకు గుంటూరు నగరంలో మహా పాదయాత్ర, 14న తుళ్ళరులో కిసాన్ సమ్మేళనం, 15న విజయవాడలో పాదయాత్ర 17న ఉద్దండరాయునిపాలెంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అమరావతిని రాజధానిగా ప్రకటించే వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. రేపు చేపట్టిన మహా పాదయాత్రను జయప్రదం చేయాలని కోరుతున్నామని గద్దె తిరుపతిరావు తెలిపారు.