ఇసుక అనుమతులపై విచారణ

ABN , First Publish Date - 2020-11-03T11:04:12+05:30 IST

మృతుల పేరిట మంజూరైన ఇసుక అనుమతులపై సోమవారం కొల్లూరు తహసీల్దార్‌ కార్యాలయంలో సబ్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ విచారణ చేపట్టారు.

ఇసుక అనుమతులపై విచారణ

కొల్లూరు, నవంబరు 2: మృతుల పేరిట మంజూరైన ఇసుక అనుమతులపై సోమవారం కొల్లూరు తహసీల్దార్‌ కార్యాలయంలో సబ్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ విచారణ చేపట్టారు. ఈపూరుకు చెందిన పావులూరి సాంబశివరావు మేనల్లుడు దుర్గాప్రసాద్‌, ఈపూరులంకకు చెందిన శొంఠి నాగభూషణం మనువడు లుక్కా రవి విచారణకు హాజరయ్యారు. మృతి చెందిన వారి పేర్లతో ఇసుక తవ్వకాలకు దరఖాస్తులు చేశారా అని సబ్‌ కలెక్టర్‌ ప్రశ్నించగా తాము ఎటువంటి దరఖాస్తులు చేయలేదని తెలిపారు. తమ భూమిలో ఇసుక తవ్వుకుంటామంటే అగ్రిమెంట్‌ మాత్రమే చేసినట్లు దుర్గాప్రసాద్‌ పేర్కొన్నారు.


తమ తాత పేరిట ఉన్న భూమిని తన తల్లి పేరుతో మార్పించేందుకు 2019 నవంబర్‌ 8వ తేదీన మీ సేవా ద్వారా దరఖాస్తులు కూడా చేసుకున్నామని రవి సబ్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకు వచ్చారు. అనంతరం సబ్‌కలెక్టర్‌, వీఆర్వో, ఆర్‌ఐలను ఈ విషయాలపై వివరణ కోరారు. వీఆర్వో మాత్రం పొంతనలేని సమాధానాలు చెప్పడం గమనార్హం. సర్వేయర్‌ విచారణకు హాజరు కాకపోవడంతో సబ్‌ కలెక్టర్‌ అసహనం వ్యక్తం చేశారు. రైతులు, వీఆర్వో, ఆర్‌ఐ, సర్వేయర్లు నుంచి లిఖిత పూర్వక పత్రాలు తీసుకుని నివేదికలు అందించాలని తహసీల్దార్‌ జాన్‌పీటర్‌కు సూచించారు. నివేదికలు వచ్చిన అనంతరం జిల్లా కలెక్టర్‌కు పంపనున్నట్లు సబ్‌ కలెక్టర్‌ తెలిపారు. 

Updated Date - 2020-11-03T11:04:12+05:30 IST