రూరల్‌ ఎస్పీ పీఆర్‌వో కుమార్‌ హఠాన్మరణం

ABN , First Publish Date - 2020-10-07T09:35:56+05:30 IST

రూరల్‌ ఎస్పీ పీఆర్‌వో ఏఎస్‌ఐ ఎం వెంకట కృష్ణకుమార్‌(53) మంగళవారం హఠాన్మరణం చెందారు. విధుల్లో

రూరల్‌ ఎస్పీ పీఆర్‌వో కుమార్‌ హఠాన్మరణం

గుంటూరు, అక్టోబరు 6: రూరల్‌ ఎస్పీ పీఆర్‌వో ఏఎస్‌ఐ ఎం వెంకట కృష్ణకుమార్‌(53) మంగళవారం హఠాన్మరణం చెందారు. విధుల్లో ఉండగానే అస్వస్థతకు గురికావడంతో ఇంటికి వెళ్లి అనంతరం సెయింట్‌ జోసఫ్స్‌ అసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు చేస్తున్న సమయంలో గుండెపోటు  వచ్చి మృతి చెందారు. విధి నిర్వహణలో అంకితభావం, క్రమశిక్షణతోపాటు, అందరితో సత్సంబంధాలు కొనసాగిస్తూ మంచి వ్యక్తిగా గుర్తింపు పొందిన కుమార్‌ మృతి వార్తతో అటు పోలీస్‌ వర్గాలు తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యాయి.


ఆయన కుటుంబ సభ్యులకు రూరల్‌, అర్బన్‌ ఎస్పీలు విశాల్‌గున్నీ, ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డి, అదనపు ఎస్పీలు సానుభూతి తెలిపారు. ఆయన మరణంతో వాలీబాల్‌ క్రీడాకారులతోపాటు, వివిధ రంగాల క్రీడాకారులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కుమార్‌ పోలీస్‌ అధికారుల సంఘంలో కూడా బాధ్యతలు నిర్వహించారు. మరణవార్త తెలిసిన వెంటనే పోలీస్‌ అధికారుల సంఘ నాయకులు దళవాయి సుబ్రహ్మణ్యం, మాణిక్యరావు, జేవీ తదితరులు ఆయనతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు. బుధవారం మధ్యాహ్నం స్థంభాలగరువులోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నట్లు పోలీస్‌ అధికారులు తెలిపారు.


జాతీయ స్థాయిలో వాలీబాల్‌ కోచ్‌గా...

కుమార్‌ వాలీబాల్‌ క్రీడాకారుడిగా ప్రస్థానం ప్రారంభించి జాతీయ స్థాయిలో కోచ్‌గా పని చేశారు. థాయ్‌లాండ్‌లో జరిగిన జాతీయ స్థాయి కోచ్‌ల శిక్షణకు కూడా హాజరయ్యారు. 1989లో పోలీస్‌ శాఖలో కానిస్టేబుల్‌గా చేరిన కుమార్‌ గుంటూరు, నకరికల్లు, తెనాలి, మహిళాస్టేషన్‌, రాజుపాలెం, పెదకూరపాడు తదితర పోలీస్‌ స్టేషన్లలో విధులు నిర్వహించారు. 2013 నుంచి రూరల్‌ ఎస్పీ పీఆర్‌వోగా ఉన్నారు. ఆయనకు భార్య శ్రీలక్ష్మి, ఇద్దరు కుమార్తెలు ఉండగా ఒకరికి కొద్ది నెలల క్రితమే వివాహం చేశారు. 

Updated Date - 2020-10-07T09:35:56+05:30 IST