అమరావతిని కాదంటే అభివృద్ధి శూన్యం
ABN , First Publish Date - 2020-10-04T06:29:54+05:30 IST
రాజధాని అమరావతిని కాదంటే రాష్ట్ర అభివృద్ధి శూన్యం అని రైతులు పేర్కొన్నారు. అమరావతే రాజధానిగా కొనసాగాలని రైతులు, రైతు కూలీలు చేస్తున్న ఉద్యమం శనివారం 291వ రోజుకు చేరుకుంది.
మూడు రాజధానుల వల్ల ప్రయోజనం లేదు
291వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఉద్యమం
తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి క్రైం, తాడేపల్లి, అక్టోబరు 3: రాజధాని అమరావతిని కాదంటే రాష్ట్ర అభివృద్ధి శూన్యం అని రైతులు పేర్కొన్నారు. అమరావతే రాజధానిగా కొనసాగాలని రైతులు, రైతు కూలీలు చేస్తున్న ఉద్యమం శనివారం 291వ రోజుకు చేరుకుంది. పెదపరిమి, తుళ్లూరు, మందడం, అనంతవరం, నెక్కల్లు, ఉద్దండ్రాయునిపాలెం, రాయపూడి, వెలగపూడి, ఐనవోలు, దొండపాడు, మందడం, అబ్బరాజుపాలెం, బోరుపాలెం తదితర గ్రామాల్లో దీక్షలు కొనసాగాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 33 వేల ఎకరాలు త్యాగం చేసిన తాము ఇప్పుడు ప్రభుత్వం తీరుతో నడిరోడ్డు మీద నిలబడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు.
విశాఖలో భూములను అధిక ధరలకు అమ్ముకోవటం కోసం పరిపాలన రాజధానిగా పేరు పెట్టారని ఆరోపించారు. న్యాయమూర్తులను, న్యాయస్థానాలను బెదిరించే విచిత్ర పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయన్నారు. ప్రభుత్వం సలహాదారు అని బోర్డు తగిలించుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నత న్యాయస్థానం గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. న్యాయదేవతను గౌరవించటం నేర్చుకోవాలని హితవు పలికారు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని కోరుతూ మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, యర్రబాలెం, నవులూరు, బేతపూడి, నిడమర్రు, నీరుకొండ గ్రామాల్లో రైతు సంఘ నేతల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి.
రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక గ్రామాల్లోని సీపీఐ, తెలుగుదేశం పార్టీ నాయకులు, రైతులు, మహిళలు నిరసనలు వ్యక్తం చేశారు. మూడు రాజధానుల ప్రకటనను వెనకకు తీసుకునే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. తాడేపల్లి మండలం పెనుమాక గ్రామం బొడ్డురాయి సెంటర్లో ఐకాస ఆధ్వర్యంలో జరుగుతున్న రైతుల నిరసన దీక్ష కొనసాగింది. రైతుల ఉసురు పోసుకున్న ప్రభుత్వాలు మనజాలవని పలువురు నేతల వ్యాఖ్యానించారు.