అన్నదాత ఆశలు... నీటిపాలు
ABN , First Publish Date - 2020-11-29T05:50:08+05:30 IST
అన్నదాతల ఆశలపై నివర్ తుపాను నీళ్లు చల్లింది. ఓ పక్క వర్షం తగ్గినా పంట పొలాల్లో ముంపు మాత్రం తగ్గలేదు.
చేలల్లోనే కుళ్లిపోతున్న ఓదెలు
ముంపు పొలాల్లో తగ్గని వాన నీరు
ఆయిల్ ఇంజన్ల సాయంతో నీటి తొలగింపు
తడిచిన ధాన్యం దక్కేలా లేదని ఆవేదన
ఐదు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అంచనా
అన్నదాతల ఆశలపై నివర్ తుపాను నీళ్లు చల్లింది. ఓ పక్క వర్షం తగ్గినా పంట పొలాల్లో ముంపు మాత్రం తగ్గలేదు. ఒకవేళ ముంపు నీరు పోయినా, మళ్లీ రెండు తుపానులు రానున్నాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతుల్లో ఆందోళన మరింత పెరుగుతోంది. పంట బాగా పండిందని, ఎకరాకు 40 బస్తాల వరకు దిగుబడి వస్తుందని ఆశ పడిన రైతులు కన్నీటి పర్యం తమవుతున్నారు. వాలిన కంకులపై వర్షం పడటం, నీరు నిల్వ ఉండటంతో బీపీటీ రకాలు మొలకలొచ్చేస్తున్నా యి. జిల్లాలో 41 మండలాల్లోని 467 గ్రామాలలో సుమారు ఐదు లక్షల ఎకరాల్లో వివిధరకాల పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేసినట్లు సమాచారం. 30 మండలాల్లోని 166 గ్రామాలలో మిర్చి, కూరగాయ లు, పసుపు, అరటి, తమలపాకు, బొప్పాయి తదితర పంటలు 12 వేల ఎకరాల్లో దెబ్బతి న్నట్లు ఉద్యానశాఖ అధికారులు కలెక్టర్కు నివేదిక అందజేశారు.
తెనాలి, కొల్లూరు, గుంటూరు, నవంబరు 28, (ఆంధ్రజ్యోతి): నివర్ తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు జిల్లాలో పెద్దఎత్తున పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. డెల్టాలో వరి 80 శాతం పూర్తిగా దెబ్బతిన్నది. మెట్ట ప్రాంతాలలో పత్తి, మిర్చి రైతులు ఇప్పటికే నష్టపోయారు. నాలుగు రోజుల్లో పం ట ఇంటికి చేరుతుందనగా వర్షం తుడిచిపెట్టేసింది. కోతకొచ్చి న దశలో వరిపంటపై వర్షాల ప్రభావం అధికంగా ఉండటం తో ధాన్యం దిగుబడిపై తీవ్ర ప్రభావం ఉంటుందని రైతుల ఆందోళన చెందుతున్నారు. వర్షపు నీరు పొలాల్లో నిల్వ ఉండటంతో పంట, కోత కోసిన ఓదెలు కుళ్లిపోతున్నాయి. మూడు రోజులుగా తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలతో కొన్ని చోట్ల కోత కోసిన వరి కంకులు మొలకెత్తుతున్నాయి. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలు ప్రకృ తి విపత్తుకు దక్కకుండా పోయాయని ఆవేదన చెందుతున్నా రు. ఎకరాకు ఎంత తక్కువైనా సగటున ఎకరాకు 38 బస్తాల వరకు దిగుబడి దక్కుతుందని రైతులు ఆశించగా ఆ పరిస్థితి కానరావడం లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. నీట మునిగిన వరి కంకులను చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డెల్టా ప్రాంతంలో డ్రెయిన్ల వద్ద ఉన్న చేలల్లో నీరు తగ్గకపోగా పెరుగుతుంది. నీటిని బయటకు తీసి కొంత వరకైనా పంటను కాపాడుకునేందుకు రైతులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం గా ఉన్నాయి. డ్రెయిన్ల ద్వారా నీటిని బయటకు పంపేదుకు వీలు ఉండటంలేదు. ఆయిల్ ఇంజన్తో నీటిని పంపేందుకు రోజుకు రూ.4,500 ఖర్చవుతుందని వెంకటేశ్శరరావు అనే రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. పెదరావూరు-యడవూరు మధ్య డ్రెయిన్ సరిగా లేకపోవటంతో మూడు కి.మీటర్ల పొడవునా రైతులే ఎక్స్కవేటర్తో పూడిక తీసివేయించుకుంటున్నారు. కొల్లూరు, వేమూరు, భట్టిప్రోలు మండలాల్లోనూ రైతులు పూడిక తీయించుకుంటున్నారు. తెనాలి డివిజన్లోని డెల్టా ప్రాం తంలో వరి రైతులు భారీగా నష్ట్టపోయారు. లంక గ్రామాల్లోని అరటి తోటలు సైతం ఈదురు గాలులకు విరిగి పడ్డాయి. కోతకోసిన ఓదెల నుంచే కాకుండా, నేలవాలిన కంకుల నుంచి కూడా మొలకలొస్తున్నాయి. ధాన్యం మొలకెత్తితే అమ్ముకునేందుకు మిగిలేదేమీ ఉండదని రైతులు వాపోతున్నారు.
పంట నష్టాలపై అధికారుల పరిశీలన
జిల్లాలో నలుగురు ఐఏఎస్ అధికారులు శనివారం ఆయా ప్రాంతాలలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. జేసీలు దినేష్కుమార్, ప్రశాంతి, సబ్కలెక్టర్లు శ్రీవాస్ నుపూర్ అజయ్కుమార్ (నరసరావుపేట), మయార్ అశోక్ (తెనా లి)లు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఆయా ప్రాం తాలలో రాజకీయ పక్షాల నాయకులు, ప్రజాప్రతినిఽధలు కూడా పొలాలను పరిశీలించి వాననీటిని బయటకు పంపటానికి తగిన ఏర్పాట్లు చేశారు.
పంటల బీమాపైనే ఆశలు
తుపానులో మునిగిన పంటలకు బీమా పరిహారం వస్తుం దని రైతులు ఆశతో ఉన్నారు. అయితే ప్రభుత్వం విధించిన సవాలక్ష షరతులతో బీమా పరిహారం కూడా అందదేమోనని ఆందోళన చెందుతున్నారు. రంగు మారిన ధాన్యాన్ని కొనేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా అందరికీ న్యాయం జరు గుతుందా అనే సంశమయంలో అన్నదాతలు ఉన్నారు. తడిచిన, రంగు మారిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని చెప్పటంతో కొంతవరకు ఆశతో ఉన్న రైతుల ఆశలు మొలకకు చూసి ఆవిరైపోతున్నాయి. కనీసం దక్కిన ధాన్యన్ని అమ్ముకుంటే ప్రభుత్వం పరిహారం అందించినా, కొంతలో కొంతైనా అప్పుల ఊబి నుంచి బయటపడవచ్చని భావిస్తున్నారు.
అప్పుడు వరద.. ఇప్పుడు వర్షం
కృష్ణా తీరంలోని లంక గ్రామాల్లో గత నెలలో ముంచెత్తిన వరదలకు వాణిజ్య పంటల రైతులు తీవ్ర నష్టాన్ని భరించారు. పసుపు, కంద రైతులు తుడిచిపెట్టుకుపోతే, కాస్తోకూస్తో మిగిలిన అరటి, తమలపాకు, కూరగాయల తోటల రైతులపై నివర్ విరుచుకుపడింది. వర్షానికితోడు పెనుగాలులతో అరటి తోటలు నేలకొరిగాయి. వరదల తర్వాత తమలపాకు ముదురు తోటలు మిగిలి ఉంటే, తుపాను గాలులకు అవికూడా వాలిపోయాయి. దొండ, కాకర వంటి తీగ పందిరిపై ఉన్న తోటలుకూడా గాలులకు నేలవాలిపోయాయి. తెనాలి, దుగ్గిరాల మండలాల్లో సాగయ్యే బెల్లం చెరకు తోటలు వేర్లతో సహా వాలిపోయాయి.
నీటిని బయటకు తీయాలి
వర్షాలకు కోత దశకొచ్చిన వరిపైరు నేలవాలిపోతోంది. అటువంటి చేలల్లో నిల్వ ఉన్న నీటిని, వర్షపు నీటిని వెంటనే తీసివేసేలా చూడాలి. నేలవాలిన, మానుకాయ వేస్తున్నట్టు అనుమానం ఉన్న పైరుపైన ఉప్పునీటి ద్రావణాన్ని పిచికారి చెయ్యాలి. ప్రస్తుత వర్షాలకు నష్టం పాక్షికంగా ఉన్నా, మరో నాలుగు రోజులు వర్షం కురిస్తే మాత్రం పైరు దెబ్బతినే ప్రమాదం ఉంది.
- శ్రీకృష్ణదేవరాయలు, ఏడీఏ తెనాలి