పేదల ఇళ్ల పథకంలో వైసీపీ దోపిడీ

ABN , First Publish Date - 2020-12-28T05:29:54+05:30 IST

వైసీపీ ప్రభుత్వంలో పేదల నివేశన స్థలాల పేరుతో ప్రజాప్రతినిధులు భారీ దోపిడీ, అవినీతికి పాల్పడారని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్‌ ఆరోపించారు.

పేదల ఇళ్ల పథకంలో వైసీపీ దోపిడీ
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్‌

మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర 

పొన్నూరుటౌన్‌, డిసెంబరు27: వైసీపీ ప్రభుత్వంలో పేదల నివేశన స్థలాల పేరుతో ప్రజాప్రతినిధులు భారీ దోపిడీ, అవినీతికి పాల్పడారని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్‌ ఆరోపించారు. స్థానిక నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఆదివారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిడుబ్రోలులో భూ కొనుగోలులో రైతులకు ఎకరానికి రూ.30 లక్షలు చెల్లించి ప్రభుత్వం నుంచి రూ.40 లక్షలు మంజూరు చేయించుకున్నారని ఆరోపించారు. నారాకోడూరులో 1989 నుంచి హైకోర్టు వివాదంలో ఉన్న దేవాదాయ శాఖ భూమిని ఇళ్లస్థలాల కోసం సేకరిస్తే కోర్టు వివాదం కారణంగా ఆగిపోయిందన్నారు. గొడవర్రులో ట్యాంక్‌ పోరంబోకు భూములను ఇళ్ల స్థలాలుగా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. నండూరులో పంట భూముల మధ్యలో నివేశన స్థలాలు ఏర్పాటు చేసారన్నారు. నారాకోడూరు పరిసర ప్రాంతాలు, గుంటూరు రూరల్‌లో సేకరించిన భూములు నివాస యోగ్యమేనా అన్ని ప్రశ్నించారు. మాచవరం, వలసమాలపల్లిలో రాత్రికి రాత్రే లబ్ధిదారుల జాబితా ఎలా తారుమారైందని ప్రశ్నించారు. పొన్నూరులో కొత్తగా వ్యాపారం ప్రారంభించాలంటే అనధికార ట్యాక్సులు కట్టాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. సంగం డెయిరీ గురించి మాట్లాడుతున్నారని.. అది మా రక్తంలోనే ఉందనే విషయం మరువొద్దన్నారు. డీవీసీ హాస్పటల్‌ను ద్వారా ఎందరికో సేవ చేస్తున్నట్లు చెప్పారు. చేబ్రోలులో అక్రమ క్వారీ తవ్వకాలు, మొక్కజొన్న, జొన్న కొనుగోలులో జరిగిన అవినీతిపై ఫిర్యాదు చేసామని ఇంతవరకు విచారణ జరగలేదన్నారు. ఇప్పటికైనా అసత్య ప్రచారాలు, విమర్శలు మాని అభివృద్ధిపై దృష్టి సారించాలని వైసీపీ నాయకులకు నరేంద్రకుమార్‌ హితవులు పలికారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-28T05:29:54+05:30 IST